Eluru Chandrababu : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పట్టిసీమ వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2004లో పోలవరానికి టెండర్లు మధుకాన్, శీనయ్య సంస్థలకు దక్కితే కక్ష సాధింపు చర్యలతో పనులు రద్దు చేశారని ఆరోపించారు. హెడ్ వర్క్స్‌ను నిర్లక్ష్యం చేసి కమీషన్ల కోసం కాలువ పనులపై దృష్టి పెట్టారని దుయ్యబట్టారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలూ పరిష్కారం కాలేదన్నారు. 
   
2004 నుంచి పాలకుల నిర్వాకం వల్ల రెండు సార్లు ప్రాజెక్టు  బలైందన్నారు. ఐఐటీహెచ్‌ నివేదిక మేరకు వైకాపా వల్లే డయాఫ్రమ్‌ వాల్ దెబ్బతిందని తేలిందన్నారు.   పోలవరం ఆపేందుకు గతంలో జగన్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కేంద్రం ఆమోదించకుండా దిల్లీలో జగన్‌ లాబీయింగ్‌ చేశారు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారు. జగన్‌ వచ్చాక కమీషన్ల కోసం కాంట్రాక్టులను మార్చారని మండిపడ్డారు.  కాంట్రాక్టును మార్చేందుకు జగన్‌ బంధువుతో విచారణ చేయించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మా హయాంలో అవినీతి లేదని కేంద్రం చెప్పింది. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదన్నారు.  కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌లు పూర్తి చేయకే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ వద్దకు నీరు వెళ్లిందని..  జగన్‌ వచ్చాక ఏడాదిన్నరపాటు ప్రధాన డ్యామ్‌ దగ్గర పనులు చేయలేదననారు.  


దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని  విమర్శించారు.  చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేథావులు, ప్రజలు, రైతుల్లో అవగాహన తీసుకురావడానికే తన ప్రయత్నమని చెప్పారు. కరువు నివారించడానికి కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్  కట్టారు.. అందుకే ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు ఏపీలో ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఇతర నదులతో అనుసంధానించాలని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని వివరణ కోరారు.


చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు  వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ. 4909 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. టీడీపీ హయాంలోనే రూ. 2289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేశామన్నారు.ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు చెప్పారు.53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశామన్నారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అటకెక్కించడంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చింతలపూడి ఎందుకు పూర్తి చేయలేక పోయారో చెప్పాలని సీఎం జగన్‌రెడ్డిని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.