Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల ఆయనకే మేలు జరుగుతుందని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. అలాగే బాబును అరెస్ట్ చేసే ఆయన బలపడతారని భావించడం వైసీపీ సర్కారు పొరపాటు అని చెప్పుకొచ్చారు. ఈ చర్య వల్ల ఆయన బలహీనపడడానికి బదులుగా మరింత బలపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తప్పు చేసిందని ఆరోపించారు. ఓవైపు జీ20 సదస్సు జరుగుతుండగా.. మరోవైపు మంచి నేతను అరెస్టు చేయడం తనను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని  వైసీపీ సర్కారు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు కూడా బాబు అరెస్టుపై స్పందించారు. ఇది క్రూరమైన చర్య అంటూ అభివర్ణించారు. తప్పుడు ఆరోపణలతో బాబును అరెస్ట్ చేయడం ప్రజస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదంటూ వివరించారు. దీన్ని ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు. 


ప్రశ్నించే వారిని జైలుకు పంపించడం ప్రస్తుత నిరంకుశ పాలకుల రీతిగా మారిందని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రతీ సర్కారు భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేసి జైళ్లకు పంపే సంస్కృతి కేంద్రం నుంచి రాష్ట్రాలకు పాకిందంటూ కామెంట్లు చేశారు. అధికారంలో ఉన్న వారికి సహకరించకపోతే వారందరినీ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి.. నారా లోకేష్ కు ఫోన్‌ చేసి పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని, చివరకు న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ కు ధైర్యం చెప్పారు. హిట్లర్ ను మించిన రీతిలో ఏపీలో పాలన సాగుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి మరీ, ప్రతీకారం తీర్చుకోవడం దారుణం అని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన, సీపీఐలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పుకొచ్చారు. 


ఏపీ సీఎం జగన్ కావాలనే చంద్రబాబును అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. జగన్ జైలుకు వెళ్లారు కాబట్టి, బాబును కూడా పంపించాలనుకున్నారని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడరు కానీ.. బాబు చేసిన మంచిని కూడా ఇలా తప్పుగా చేసి చూపిస్తూ.. అరెస్ట్ చేయడం సరికాదన్నారు. జగన్ పై ఉన్న కేసుల విషయంలో తాను చర్చకు సిద్ధమని.. ఇడుపులపాయ, కడప.. ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేయించి జగన్‌ తప్పు చేశారని అన్నారు. బాబు అరెస్ట్ అవడం ఆయనకే మంచిదని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఆయనే గెలుస్తారని చెప్పుకొచ్చారు. మరో ఆరు నెలల్లో అనేక మంది వైసీపీ మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు అన్నారు. చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందిస్తే.. వైసీపీ మంత్రులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జైలుకు వెళ్లొచ్చిన నాయకుడితో పని చేస్తున్న, అవినీతిపరుడు అయిన బొత్స సత్యనారాయణకు జనసేనాని గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.అలాగే మంత్రి ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, లకు మంత్రులయ్యాక పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని మండిపడ్డారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం రోజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంగా సుదీర్ఘ కాలం పని చేసిన వ్యక్తిని ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా అర్ధరాత్రి అరెస్టు చేయడం దారుణం అన్నారు. అలాగే ముందస్తు నోటీసులు లేకుండా బాబును అరెస్ట్ చేయడం సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబును కావాలనే కుట్ర పూరితంగా అరెస్టు చేసినట్లు ఉందని భాజపా తెలంగాణ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ చెప్పారు. బాబు అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ముఖ్య నేతను అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. అలాగే ప్రజాస్వామ్యానికి.. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా చాలా ముక్యమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.