Vijayawada and Visakhapatnam Metro: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర మొబిలిటీ ప్లాన్  పథకంలో భాగంగా ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు   కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.   మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటడంతో.. మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు  నిధులు మంజూరు చేసింది.   కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.


మెట్రో ప్రాజెక్టులకూ రూ.42 వేల కోట్లు కేంద్రమే భరించాలంటున్న ఏపీ 
 
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.  ఏపీ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూరుశాతం ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన ‘క్లాజ్‌’ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించాలని కోరుతోంది. ఇందులో భాగంగానే డీపీఆర్ కు నిధులు మంజూరు చేయడంతో కేంద్రమే పూర్తి ఖర్చుతో నిర్మిస్తుందని భరోసాతో ఉన్నారు.                


రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం  ఏపీ  ప్రభుత్వం భారీ ప్రయత్నాలు             


కేంద్రం ఇటీవల నూతన మెట్రో పాలసీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వంతో సంబంధం లేకుండా  కేంద్రం మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉంది.  40 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంలో మెట్రో నిర్మించే అవకాశం ఉంది. ఈ  రెండు మెట్రో ప్రాజెక్టులకు రూ. 42వేల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా ఉంది.                


కేంద్రం గ్రీన్ సిగ్నల్ రాగానే తొలి దశ పనులు             


కేంద్రం డీపీఆర్‌కు నిధులు మంజూరు చేసింది. డీపీఆర్ అధికారికంగా రెడీ కాగానే  తొలిదశ  పనులు ప్రారంభించటానికి ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. విజయవాడ మెట్రోల భాగంగా మొదట  పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌(పీఎన్‌బీఎస్‌) నుంచి గన్నవరం వరకు తొలి కారిడార్, పీఎన్‌‌బీఎస్‌ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు మొత్తంగా 38.40 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టాలని భావిస్తోంది.             


కేంద్రం నుంచి పూర్తి స్థాయి అనుమతి వస్తే చాలు           


విశాఖపట్నంలో కారిడార్‌-1లో భాగంగా స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు  , కారిడార్‌-2లో గురుద్వార్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు, కారిడార్‌-3లో తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు  మొత్తం 46.23 కిలోమీటర్ల మేర తొలిదశ పనులు చేపట్టాలని అనుకుంటోంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.