Bengaluru Rave Party Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును కర్ణాటక పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ కేసును సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేప్ పార్టీ నిర్వహించిన వారిలో ప్రధాన నిందితుడు వాసుతో పాటు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిల అనుచరులు కొందరు ఉన్న విషయం తెలిసిందే.


ఇప్పటికే రేప్ పార్టీపై పోలీసులు దాడి చేసిన రోజు ఆ ఫాం హౌస్ లో మంత్రి కాకాణి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. ఆ స్టిక్కర్ ను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా హైదరాబాద్ కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆయనది ముఖ్య పాత్ర అని, ఆయన మంత్రి అనుచరుడే అని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటికే అరెస్టు అయిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ సహా మొత్తం ఎనిమిది మందికి సీసీబీ పోలీసులు శనివారం (మే 25) నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ టెస్టుల్లో బయటపడిందని తెలిపారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు.