Atchannaidu and Ram Mohan Naidu | బాబాయ్ అబ్బాయిలపై సిక్కోలు జిల్లా అభివృద్ధి మంత్రం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు పదవులు వచ్చాయని అంతా అన్నారు. జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గత పదేళ్లుగా శ్రీకాకుళం ఎంపీగానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో వివిధ సమస్యలపై గళం విప్పడంతో ప్రధాన మంత్రి మోదీ దృష్టిలో పడ్డారు. అంతేకాకుండా సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా ఆయనకున్న సత్ససంబంధాలే ఇప్పుడు సిక్కోలు జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. ప్రధానంగా జిల్లాలోని ఆముదాలవలస, పలాస, రైల్వే స్టేషన్లు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది.


శ్రీకాకుళం రోడ్ మీదుగా నడిచే వివిధ రైళ్లుకూడ అక్కడ స్టేషన్ లో నిలిచేందుకు కృషి చేశారు. కేవలం శ్రీకాకుళం జిల్లాపైన కాకుండా రాష్ట్రంపై రామ్మోహన్ నాయుడు దృష్టి సారించారు. మొన్నటికి మొన్న విజయవాడ ఎయిర్ పోర్టులో ప్రత్యేక మార్గాన్ని ప్రారంభించారు. దేశంలో తొలిసారి అని ప్రకటించారు. ఇక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పడకేయగా వాటిన్నింటిని పునరుద్దరించారు. కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసి ఈ ఏడాది సుమారు రెండు వేల ఎకరాలకు నీరందించేందుకు కృషి చేశారు. ఇక గత ఐదేళ్లుగా గొట్టా బ్యారేజ్ నుంచి పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలానికి సాగునీరు గగనమైంది. దాదాపు అరకోటి రూపాయలతో ఎడమకాలువ మరమ్మత్తు పనులు చేపట్టి వంశధార సాగునీరు శివారు ప్రాంతాలకు అందివ్వడంతో ఆప్రాంతీయుల్లో ఆనందం పొంగి ప్రవహించింది.


టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. కొత్తమ్మ తల్లి జాతర సంబరాలు ప్రభుత్వం నిర్వహించడమే కాకుండా దాదాపు కోటి రూపాయలు మంజూరుకు కృషి చేశారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తొలి వందరోజుల్లో బాబాయ్, అబ్బాయ్ తమ మార్కును చూపించారని స్థానికంగా వినిపిస్తోంది. విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ అర్ధ శతాబ్దంపైగా ఉంది. ఇప్పటికి 55 ఏళ్ల కిందట విశాఖకు రైల్వే జోన్ కావాలని ఆనాటి విశాఖ లోక్ సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం పార్లమెంట్లో గళమెత్తారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సమయంలో కొత్త జోన్లు ప్రకటించినా విశాఖకు ఆ అదృష్టం దక్కలేదు. ప్రధానిగా వాజ్ పేయ్ హయాంలోనూ మరికొన్ని రైల్వే జోన్లను ఇచ్చారు. అయినా కూడా విశాఖ పేరు ప్రస్తావనకు లేదు, విభజన హామీలలో చివరికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి దశాబ్దం దాటింది. కానీ ఇంకా రైల్వే జోన్ కూతను మాత్రం విశాఖ వాసులు వినలేదు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేశామని 2019 ఎన్నికల ముందు కేంద్రం ప్రకటించింది. కానీ అయిదేళ్లలో అడుగు ముందు పడలేదు. దానికి వైసీపీ ప్రభుత్వం భూమి చూపించలేదని కేంద్రంపేర్కొంది. తాము భూమి ఇచ్చామని వైసీపీ చెప్పింది. ఎక్కడ గ్యాప్ ఉందో తెలియదు కానీ అలా ఆ ప్రాజెక్ట్ అయితే నిలిచిపోయింది.


ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. దాంతో బీజేపీ రైల్వేజోన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఏపీ సీఎం చంద్రబాబుకూడా అడిగి తెచ్చుకోగలరు. కానీ ఆలస్యం మాత్రం అలాగేకొనసాగుతోంది. విశాఖ రైల్వే జోన్ అదిగో ఇదిగో అనికేంద్రం గడచిన మూడు నెలలలో ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా విశాఖకు మరో వందే భారత్ రైలు మంజూరు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ మీద మళ్లీ ఊరించే ప్రకటన చేశారు. విశాఖ రైల్వేజోన్కు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని చెప్పారు. దానికి ఒక ముహూర్తం కూడా ఆయన ప్రకటించారు. దసరా పండుగ తరువాత పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో పదేళ్ల ఎదురుచూపులకు దసరా తర్వాత ఐనా తమకు శుభవార్త వస్తుందా అని ఉత్తరాంధ్ర వాసులు ఆలోచిస్తున్నారు.


విశాఖకు రైల్వే జోన్ వస్తే తెన్నేటి కల సాకారం అవుతుందని అంటున్నారు. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం టీడీపీ కూటమి విశాఖలో ఇప్పటికే 52 ఎకరాలను కేటాయించిన క్రమంలో ఇక కేంద్రానిదే ఆలస్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ సువిశాలమైన ప్రాంతంలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారని వినిపిస్తోంది.