APSRTC Special Buses: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను (Special Services) నడుపుతామని ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకూ శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, బెంగుళూరు, చెన్నై నగరాలకు బస్సులు నడపనున్నారు. మొత్తం 934 సర్వీసులు తిప్పేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 353 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరానికి 241, విశాఖకు 90, బెంగుళూరుకు 14, చెన్నైకు 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడపనున్నారు. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సైతం 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15 వరకూ 13 రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. అలాగే, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, అక్టోబర్ 16న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. 


భారీగా ఆదాయం


ఉద్యోగ, ఉపాధి నిమిత్తం భాగ్యనగరంలో ఉన్న వారు ప్రతి ఏటా దసరా, సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఈ క్రమంలో వారి సౌలభ్యం నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అటు, రైల్వే శాఖ సైతం దసరా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రతి ఏటా పండుగ సమయాల్లో ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తోంది. ఈసారి కూడా భారీగానే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్ తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. అప్పుడు మొత్తం 950 బస్సులను 5.30 లక్షల కిలోమీటర్ల మేర తిప్పారు. కిలో మీటరుకు రూ.44.36 మేర రాబడి వచ్చింది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో నడిచే సర్వీసుల ద్వారా గరిష్టంగా రూ.1.08 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ రూట్‌లో రూ.75.52 లక్షలు వచ్చింది. 


Also Read: Tirupati Laddu Row:బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత