APSRTC Special Offer :ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ప్రకటించింది. అయితే ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మరో అడుగు ముందుకేసి రాయితీలు కూడా వెల్లడించింది. ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్ల వైపు మరలకుండా రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ టికెట్ లో 25 శాతం రాయితీ ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా మరో బంపర్ ఆఫర్ తెరపైకి తెచ్చింది. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్టు తీసుకుంటే ఛార్జీల మొత్తంలో 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగకు కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే వారికి ఉపయోగంగా ఈ స్కీమ్ అందుబాటులోకి తీసుకొట్టింది. ఈ-వాలెట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నా ఛార్జీల్లో 5 శాతం రాయితీ వెసులుబాటు కల్పించింది. అలాగే రానూ పోనూ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణం ఛార్జీల్లో 10 శాతం తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. 


పండుగకు 6400 స్పెషల్ బస్సులు 


సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండగకు 6400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అయితే పండగ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ  తిరుమలరావు చెప్పారు. ఒకేసారి రానూపోనూ టికెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 


హైదరాబాద్ నుంచి 


సంక్రాంతి పర్వ దినానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీ వాసుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 18 వందల బస్సులు నడపాలని చూస్తుండగా.. తాజాగా టీఎస్ఆర్టీసీ దాదాపు 15 వందల బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భాగ్య నగరం నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు బస్సులు తగ్గించిన ఆర్టీసీ.. ఈ ఏడు భారీగా బస్సులను పెంచుతోంది. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి 15 లక్షల మంది వరకూ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


ఇరు ఆర్టీసీలు పోటాపోటీ


జనవరి 6వ తేదీ నుంచి 14 వరకు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోళు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ నుంచి నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కృష్ణ కిషోర్ నాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రా వైపు వెళ్లే బస్సులను దిల్ సుఖ్ నగర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తోందని వివరించారు. అయితే రెండు ఆర్టీసీలు నడిపే ప్రత్యేక బస్సులు నిజానికి సరిపోవు. ఎక్కువ మంది రైళ్లలో వెళ్తుండగా, అంతకంటే ఎక్కువ మంది సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కొంత కాలంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు కార్లు, మినీ బస్సుల వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టీఎస్, ఏపీ ఆర్టీసీలు పండుగ స్పెషల్ బస్సుల్లో విధించే 50 శాతం అదనపు ఛార్జీని రద్దు చేశాయి.