ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం నెక్ట్స్ లెవల్‌కు చేరింది. చలో విజయవాడతో  ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇంతటితో అయిపోలేదని సమ్మెను సైతం ప్రభుత్వం కళ్లు తెరిపించేలా చేస్తామంటున్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఇంత దూరం ఎందుకు పెరిగింది ? పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా పోవడమే కారణమా ? 


పీఆర్సీ ప్రకటించినప్పుడు స్వాగతించి చప్పట్లు కొట్టిన ఉద్యోగ సంఘం నేతలు ! 


జనవరి ఏడో తేదీన సీఎం జగన్ ఉద్యోగ సంఘ నేతలందర్నీ పిలిపించి సమావేశమై.. పీఆర్సీని ప్రకటించారు. అప్పుడు ఏం జరిగిందో అందరూ చూశారు. ఉద్యోగ సంఘాల నేతలందరూ సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించిన వెంటనే చప్పట్లు కొట్టారు.  స్వాగతించారు. ఫిట్‌మెంట్ తగ్గించినా సరే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని అభినందించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతోనూ అదే సంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ ప్రకటించిన రోజున ఉద్యోగ సంఘం నేతలందరూ విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పార్టీ చేసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. 


చప్పట్లు కొట్టిన మూడు రోజుల్లోనే సీన్ ఎందుకు మారిపోయింది ? 


అయితే ఉద్యోగ సంఘం నేతలు పీఆర్సీకి అనుకూలంగా చప్పట్లు కొట్టి రెండు రోజులు గడవక ముందే పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అలలెవన్స్‌ల తగ్గింపు. సీఎం జగన్ రెండేళ్ల సర్వీసు పెంపు గురించి చెప్పారు. పెండింగ్ డీఏలన్నీ ఒకే సారి ఇస్తున్నట్లుగా చెప్పారు. కానీ హెచ్‌ఆర్ఏ తగ్గింపు, సీసీఏ రద్దు గురించి చెప్పలేదు. దీంతో తగ్గింపు ఉండదని అనుకున్నారు. కానీ అప్పటికే సీఎస్ కమిటీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సిఫార్సు చేసింది. దాన్నే అమలు చేస్తున్నామని తర్వాత చెప్పారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతల చప్పట్లు.., సంబరాలు అన్నీ ఆవిరైపోయాయి.  ఫిట్‌మెంట్ తగ్గించినా ఒప్పుకున్నారు కానీ.. హెచ్‌ఆర్‌ఏ మాత్రం తగ్గించవద్దని కోరారు. తమకు చెప్పకుండా జీవోలివ్వవద్దన్నారు. సెక్రటేరియట్ ముందు పడిగాపులు కాశారు. కానీ ప్రభుత్వం వారిని లెక్కలోకి తీసుకోలేదు. పండగయిపోయిన తర్వాతి రోజు అర్థరాత్రే జీవోలొచ్చేశాయి. 


ఉద్యోగ సంఘాల నేతలకు ఘోర అవమానాలు !


ఉద్యోగ నేతలు ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా వ్యవహరించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని అలసుగా తీసుకుందన్న అభిప్రాయంలో ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఎస్‌ఈసీతో విభేదించి మరీ ప్రభు్తవానిక మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత కూడా ఆ సంబంధాలు కొనసాగాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల దగ్గరకు వచ్చే సరికి ఉద్యోగ సంఘం నేతలను చర్చల పేరుతో అవమానించారన్న ఆరోపణలు ఉన్నాయి. పదే పదే పిలవడం.. కూర్చోబెట్టి పంపడం చేశారు. చివరికి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక కూడా ఇవ్వలేదు. చివరికి చర్చలకు పేరుకు పిలిచారు కానీ వారి మాటలేం ఆలకించలేదు. ప్రభుత్వం అనుకున్నట్లుగా పీఆర్సీ ప్రకటించేసింది. సరే అని సర్దుకుపోయినా గత ప్రభుత్వం ఇచ్చిన అలవెన్స్‌లు రద్దు చేయడంతో ఇక ఆవేశం ఆపుకోలేకపోయారు.


ప్రభుత్వం.. ఉద్యోగుల్ని తక్కువ అంచనా వేయడం వల్లే ఇదంతా !? 


ఇప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలుస్తోంది.కానీ వారే తమ డిమాండ్లను పూర్తిగా తగ్గించేసుకుని ఉద్యమం ఆపేయాలని కోరుతోంది. పాత జీతాలే ఇవ్వాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను పట్టించుకోక పోగా ప్రైవేటు ఏజెన్సీ సాయంతో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు జమ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వనే ఇవ్వబోమంటున్నారు. ఇంత కాలం టైం పాస్ చేసి ఇప్పుడు వాటికి కాలపరిమితి తీరిపోయిందని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. పైగా ప్రభుత్వ పరంగా.. చర్యల బెదిరింపులూ వస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగుల్ని తక్కువగా అంచనా వేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు.