Vinayaka Chaviti 2022 : ఏపీలో వినాయక మండపాల వివాదం ముదురుతోంది. గణేష్ మండపాల ఏర్పాటుకు ఫైర్, విద్యుత్, పోలీసుల అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే విద్యుత్, పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోమనడం నిబంధనలు కావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, సీఎం జగన్ అక్కడికి వెళ్తే తెలుస్తుందన్నారు. రాజమండ్రిలో నిర్వహించే వినాయక వేడుకల్లో తాను స్వయంగా పాల్గొంటానన్నారు. ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి అనుమతి తీసుకోనని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు సోము వీర్రాజు. హిందూ పండుగలకే నిబంధనలు గుర్తొస్తాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 


వైసీపీ కౌంటర్ ఎటాక్ 


వినాయక మండపాలపై ఏర్పాటుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబును వినాయకుడు క్షమించడంటూ వైసీపీ కౌంట‌ర్ అటాక్ కు దిగింది. విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వినాయక మండపాలకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదన్నారు. మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర తగ్గించామన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా 9 రోజుల మైక్ పర్మిషన్ కు వెయ్యి రూపాయలే అన్నారు. వినాయక చవితి వేడుకలకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. రుసుముల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదన్నారు. దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సోము వీర్రాజు, చంద్రబాబులపై కేసులు పెట్టాలన్నారు. గత ప్రభుత్వంలో గుడులు కూల్చినప్పుడు హిందుత్వానికి విఘాతం కలిగింద‌న్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా .. ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు.  


మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర  తగ్గించాం 


"చంద్రబాబు ప్రభుత్వంలో వినాయక చవితి మండపాలకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించి 500 మెగావాట్‌ లోడు వరకూ వెయ్యి రూపాయలు వసూలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. మేము అధికారంలోకి వచ్చాక వినాయక చవితి పందిళ్ల విషయంలో ఆ స్లాబ్‌ను తగ్గించి వెయ్యి రూపాయిలను రూ. 500 చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ- బీజేపీ వాళ్లు ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రుసుముల విషయంలో మా ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదు. మేము అధికారంలో వచ్చాక మండపాలకు విద్యుత్‌ ఛార్జీలు గానీ, పోలీస్‌ శాఖ, నగర పాలక సంస్థలు వసూలు చేసే రుసుముల విషయంలోనూ ఏవిధమైన కొత్త నిబంధనలు తీసుకురాలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014లో తీసుకువచ్చిన జీవో ప్రకారమే అన్నీ ఉన్నాయి. మండపాల వద్ద డీజేలు వాడవద్దని టీడీపీ సర్కార్‌ హయాంలోనే పోలీస్‌ శాఖ ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ- బీజేపీ సంయుక్త ప్రభుత్వంలో, అంటే 2014- 19 మధ్య కరెంట్‌ ఛార్జీలు పెంచింది, డీజేలు వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది." - మల్లాది విష్ణు  


వీర్రాజుకు దమ్ముంటే


సోము వీర్రాజుకు చేతనైతే, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇప్పించవచ్చు కదా? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. తిరుపతిలో బీజేపీ అగ్ర నాయకులు ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటన మర్చిపోయారా? అని నిలదీశారు. ఏపీకి అయిదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో బీజేపీ నాయకులు చెప్పారని, కేంద్రం దగ్గరకు వెళ్లి వాటిని సాధించుకురావాలన్నారు. అంతేకానీ చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేసి దిగజారి మాట్లొద్దన్నారు. టీడీపీ-బీజేపీ పాలనలో నిబంధనలు విధించినప్పుడు ఇవేమీ గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. 


ప్రత్యేక ఆంక్షలు లేవు- డీజీపీ 


ఏపీలో వినాయ‌క చ‌వితి వేడుకలకు నిబంధనలకు సంబంధించి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పందించారు. చ‌వితి వేడుక‌ల‌పై ప్రత్యేక ఆంక్షలు ఏమిలేవన్నారు. భ‌ద్రత దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామ‌న్నారు. ఇందులో భాగంగా వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత పోలీస్ స్టేష‌న్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.  అదేవిధంగా నిబంధ‌న‌లకు అనుగుణంగా మండ‌పాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రమే స్పీక‌ర్లకు అనుమ‌తి ఉంటుంద‌ని డీజీపీ స్పష్టం చేశారు. 


Also Read : Ganesh Chaturthi 2022 : గణేష్ మండపాల ఏర్పాటుకు రుసుం చెల్లించక్కర్లేదు- ఏపీ దేవాదాయ శాఖ