రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే సీఎం జగన్ జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారని టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ లో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారని ఆరోపించారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి కొత్త జిల్లాలు తెరపైకి తీసుకువచ్చారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని కానీ...ఇలా స‌మ‌స్యలు త‌లెత్తేలా నిర్ణయాలు ఉండ‌కూడ‌ద‌ని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 


ఎన్టీఆర్ పేరు సమ్మతమే...


కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామ‌ని టీడీపీ నేత‌లు అన్నారు. ఎన్టీఆర్ ను ఎవ‌రు గౌర‌వించినా స్వాగ‌తిస్తామన్నారు. అయితే ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాద‌ని ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని గుర్తుచేశారు. హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించినా తాము వైఎస్ పేరు క‌డ‌ప జిల్లాకు పెట్టిన‌ప్పుడు వ్యతిరేకించ‌లేద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతివ‌నం ప్రాజెక్టును నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మర‌న్నారు. చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్న క్యాంటీల‌ను కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. 


Also Read: రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !


అస్తవ్యస్తంగా విభజన


జిల్లాల విభజన అస్తవ్యస్తంగా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజ‌ల ఆకాంక్షల‌కు వ్యతిరేకంగా విభజన ఉందన్నారు. అందుకే చాలా చోట్ల నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయన్నారు. వైసీపీలోనే కొత్త జిల్లాల నిర్ణయంపై వ్యతిరేకత వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టవద్దని కేంద్రం స్పష్టం చేసినా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. తొంద‌ర‌పాటు నిర్ణయాల‌తో ఇప్పటికే రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్... ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు త‌లెత్తే ప‌రిస్థితి తెచ్చారన్నారు. క‌నీసం కేబినెట్ లో కూడా స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌కుండా రాత్రికి రాత్రి నోటిఫికేష‌న్ విడుద‌ల చెయ్యాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్రశ్నించారు. కేబినెట్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదన్న టీడీపీ నేతలు... అయితే 25వ తేదీ రాత్రికి రాత్రి మంత్రుల‌కు నోట్ పంపి ఆమోదం పొందాల్సినంత అత్యవ‌స‌ర ప‌రిస్థితి ఏమి వ‌చ్చిందని ప్రశ్నించారు.  రాజ‌ధానుల త‌ర‌లింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీల‌క అంశాల‌పైనా రాజ‌కీయ ప్రయోజ‌నం పొందాల‌ని చూస్తున్నారని ఆరోపించారు. 


గుడివాడ క్యాసినో గవర్నర్ స్పందించాలి


గుడివాడలో క్యాసినో వ్యవహారంపై టీడీపీ చేసిన ఫిర్యాదుపై గ‌వ‌ర్నర్ స్పందిచాలని స‌మావేశంలో నేత‌లు అన్నారు. ఏకంగా కేబినెట్ లోని మంత్రి క్యాసినో ఆడించిన ఘ‌ట‌న‌పై త‌క్షణ చ‌ర్యలు ఉండాల‌ని అన్నారు. ఈ విషయంపై పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.