AP Revenue Services Association: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఐదోసారి, ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్టమూర్తి రెండో సారి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు విజయవాడ గవర్నర్‌పేటలోని రెవెన్యూ భవన్‌లో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారి పీవీ కృష్ణారావు నామినేషన్ పత్రాలు స్వీకరించి తర్వాత స్క్రూటినీ నిర్వహించారు. ప్రక్రియ తదనంతరం మధ్యాహ్నం ఏకగ్రీవంగా ఎన్నికైన 30 మంది సభ్యుల ఫలితాలు వెల్లడించారు.


ఈ సందర్భంగా నూతన కమిటీకి అభినందనలు వెల్లువెత్తాయి. అక్టోబర్ 1వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెవెన్యూ ఉద్యోగుల 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగనుంది. కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి ధర్మాన  హాజరు కానున్నారు. ఆయన సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. వీరి పదవీ కాలం 2026 వరకు ఉంటుంది.  చివరిసారిగా 2017లో 16 వ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్ సమావేశం జరిగింది. 


బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో జరగాల్సి ఉన్నా కరోనా తీవ్రత కారణంగా జరగలేదన్నారు. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ రెవెన్యూ పండుగకు వేల సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు హాజరవుతున్నారని చెప్పారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు అందరూ ఏకతాటిపై నిలిచి 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేసి రెవెన్యూ ఉద్యోగుల ఐకమత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.


ఆదివారం జరగే కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సాయి ప్రసాద్, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ 
 ఢిల్లీ రావు, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి హాజరవుతారని బొప్పరాజు తెలిపారు. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్టమూర్తిని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరుఫున సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి మురళికృష్టనాయుడు, వివిధ సంఘాల నాయకులు సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసారు.


నూతన కార్యవర్గం ఇదే.. 
బొప్పరాజు వెంకటేశ్వర్లు (రాష్ట్ర అధ్యక్షులు), చేబ్రోలు కృష్ణమూర్తి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), పితాని త్రినాధరావు (రాష్ట్ర సహాధ్యక్షులు), చెవుల నరసింహారావు (రాష్ట్ర కోశాధికారి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎనిమిది మందిని ఎన్నుకున్నారు. శ్రీనివాస్, జీవన్ చంద్రశేఖర్, గొట్టపు శ్రీరామ్మూర్తి, వేణుగోపాలరావు, రామిశెట్టి వెంకట రాజేష్ , అల్లంపాటి పెంచల్ రెడ్డి, అమర్నాథ్, పి జాహ్నవిని ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక కార్యదర్శులుగా రాజేంద్ర వర్మ, ఆర్‌వీవీ రోహిణి దేవి ఎన్నికయ్యారు.


డి.దివ్య దుర్గా దేవి, ఎస్ విజయ్ శేఖర్, సీహెచ్ బంగారు రాజు, బి అనురాధ, జి శ్రీనివాస్, జి సోమశేఖర్, ఎం అశోక్ రెడ్డి, ఓ ప్రశాంత్ కుమార్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎం.వెంకట రాజు, రవి విక్రమ్, ఎన్. రామాంజనేయులు, జి.నారాయణ రాజు, జి.శ్రీనివాసు, ఎస్ జీవన రాణి, కె.కిశోర్, షేక్ షలీమా ఎన్నికయ్యారు.