AP Ration Card Holders: ఐక్య రాజ్య సమితి 2023ను మిల్లెట్ ఇయర్ గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భారత్ చొరవతో ఐక్యరాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దీన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ నెల నుంచి రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతోంది.


ప్రతినెలా ఇచ్చే రేషన్ లో రెండు కిలోల బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, సజ్జలు సరఫరా చేయబోతోంది. దీని వల్ల రేషన్ కార్డు దారులే కాకుండా రైతులకు కూడా సాయం చేసినట్లు అవుతుందని ప్రభుత్వం చెబతోంది. అటు రైతులను చిరుధాన్యాల సాగు వైపు ప్రోత్సహించేలా.. ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే వారికి నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది. కిలో గోధుమ పిండి ప్యాకెట్ ధరను రూ.16గా ఖరారు చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మున్సిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధమ పండి అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై 2 కిలోల వంతున కిలో, కిలో ప్యాకెట్లను అందజేస్తారు.