సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ తేనీటి విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో తేనీటి విందుకు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు హాజరు అయ్యారు. ఈ తేనీటి విందుకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నర్సింహ, జస్టిస్ వినీత్‌ శర్మ, ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.



Also Read:  సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా ఆహ్వానించిన సీఎం జగన్ ! 


దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఏపీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో జరిగిన దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో పాల్గొని ఎన్వీ రమణ ప్రసంగించారు. న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందని చెప్పారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా.. ఓ తెలుగువాడిగా శాయశక్తులా పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు. తెలుగు వాడి గౌరవం ఏ మాత్రం తగ్గకుండా, తెలుగు వాడి కీర్తి పతాకాన్ని ఎగురవేస్తానని తెలుగు ప్రజలకు మాటిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చేసిన సేవలను కొడియాడారు. ఆయన ఆదర్శాలు, విలువలను కుమారుడు జస్టిస్ లావు నాగేశ్వరరావు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్వగ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్య పట్ల అవగాహన పెంచారు. నాణ్యమైన విద్యతో యువతకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని భావించిన వ్యక్తి అని ఎన్వీ రమణ తెలిపారు. క్రీడలతో యువతలో స్ఫూర్తి నింపారని, ఆటలతో చదువుపై మక్కువ పెరగడానికి తన వంతుగా శ్రమించారని గుర్తుచేశారు.


Also Read:  నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ? 


న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు


భారతదేశం 1990 దశకం తొలినాళ్లలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అయినా కీలక నిర్ణయాలతో పరిస్థితి గాడిన పడింది. ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులతో భారత్ మళ్లీ పుంజుకుందన్నారు. న్యాయవ్యవస్థ సైతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతుందని.. రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇటీవల ఆర్బిటరేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంలోనూ న్యాయవ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాల వారు శాంతియుతంగా చర్చించుకుని సమస్యను సామరస్యకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఏళ్ల తరబడి టైమ్ వేస్ట్ అవుతుందని.. ప్రతి విషయాన్ని కోర్టుల్లోనే తేల్చుకోవాలనుకోవడం సరైన విధానం కాదని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.  


Also Read: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి