ఎవరెస్ట్ శిఖరాలపై నవరత్నాల పథకాల గురించి ప్రచారం చేశారు పర్వతారోహకుడు సురేష్ బాబు. ఐదేళ్ల కాలంలో 25 పర్వతాలను అధిరోహించిన సురేష్ బాబు ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు సంబంధించిన పోస్టర్లను పర్వతాలపై ప్రదర్శించారు. గతంలో విశాఖపట్నం నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్‌ వర్మ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. ఎవరెస్టుపై నవరత్న పథకాల పోస్టర్ ప్రదర్శించి, జెండా ఎగురవేశాడు. 
ఎవరెస్ట్ శిఖాలపై నవరత్నాలు..
ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు సురేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఎవరెస్ట్ శిఖరాలపై సీఎం జగన్ ఫొటోతో పాటుగా నవరత్నాల పథకాలకు సంబంధించిన బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో సురేష్ ను పార్టీ నాయకులు అభినందించారు. వైఎస్సార్ సీపీ కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సురేష్ బాబు మౌంట్ మనస్లు ,మౌంట్ లోట్సే ని అధిరోహించిన మొదటి దక్షిణ భారతీయుడుగా నిలిచారు. సీఎం జగన్ 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో కూడ పాల్గోన్న సురేష్ బాబు సీఎం జగన్ స్పూర్తితో పర్వతారోహణను అభ్యాసంగా ఎంచుకున్నారు. ఇప్పటివరకు ఐదేళ్ల కాలంలో 25 పర్వతాలను అధిరోహించిన సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనకు సంబంధించిన పోస్టర్లను పర్వతాలపై ప్రదర్శించారు. 
పర్వతారోహకుడికి అండగా వైసీపీ..
పర్వతారోహనను కొనసాగించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సురేష్ బాబును వైఎస్సార్ సీపీ గుర్తించింది. కర్నూల్ ఎంపీ, డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి సురేష్ బాబుకు ఆర్థిక సాయం అందించి వైఎస్సార్ సీపీ నేతలు సురేష్ బాబును అభినందించారు. కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సురేష్ బాబు పర్వతారోహణను కొనసాగించాలని దీని కోసం భవిష్యత్తులో ఏ సహాయం అవసరమైనా చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి సురేష్ కుమార్ కు మరింత సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సురేష్ బాబు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. 
కేంద్ర ప్రభుత్వం ద్వారా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు సిపారసు చేస్తామన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ బాబును చూసి గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో సురేష్ బాబు పర్వతారోహణ కొనసాగేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన సురేష్ బాబు నూతన ఇంటికి పూజా కార్యక్రమాలు చేసి గృహ ప్రవేశం చేశారు.


నవరత్నాలతో తన జీవితంలో మార్పు..
సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలతో తన జీవితంలో ఎంతో భరోసా వచ్చిందని, తన కుటుంబ ప్రాథమిక సమస్యలు తొలగిపోయాయని పర్వతారోహకుడు సరేష్ బాబు  వివరించారు. సీఎం జగన్ స్పూర్తిగా సాగిన పర్వతారోహణ పై సీఎం జగన్ కు ప్రత్యక్షంగా వివరించే అవకాశం కల్పించాలని కోరారు. మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా తాను అధిరోహించిన మౌంట్ మనస్లు, మౌంట్ లోట్సేపై సీఎం జగన్ ప్రారంభించిన నవరత్నాల (తొమ్మిది సంక్షేమ పథకాలు) బ్యానర్‌ను ప్రదర్శించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను, కలలను సాకారం చేసుకునేందుకు ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికి ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో 3,648 కి.మీ.ల మేర భారీ దూరం నడవడం చూసి, ఆయన అంకితభావం, నిబద్ధతతో స్ఫూర్తి పొంది నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి సీఎం జగన్ అమలు చేసిన నవరత్నాల సాయం తనకు ఎంతగానో ఉపయోగపడిందని సురేష్ అంటున్నారు. తాను సాధించిన ఘనత సీఎం జగన్ కు తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరెస్ట్ శిఖరం పై బ్యానర్లను ప్రదర్శించినట్లు తెలిపారు.