Dharmana Prasada Rao On Amma Vodi: అమ్మ ఒడి పథకం సీఎం జగన్‌ దూరదృష్టితో ప్రవేశపెట్టారు- శ్రీకాకుళంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధర్మాన

ABP Desam Updated at: 27 Jun 2022 01:11 PM (IST)

అమ్మఒడి పథకం యాభై ఏళ్ల కిందట వచ్చి ఉంటే రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పరిస్థితి వేరుగా ఉండేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

అమ్మ ఒడి డబ్బులు విడుదల సభలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన

NEXT PREV

అమ్మఒడి పథకం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో వచ్చిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రలో విద్యకు సీఎం జగన్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పేద పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించాలన్నదే సీఎం ఆశయమన్నారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన అమ్మఒడి కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 


ఇంకా ధర్మాన ఏమన్నారంటే...



" అమ్మ ఒడి పథకం అషామాషీగా వచ్చింది కాదు. దూరదృష్టితో సీఎం జగన్‌ చేసిన ఆలోచన ఇది. ఓ సాధారణ కుటుంబంలోని పిల్లాడు కూడా అందరిలా చదువుకోవాలి, కలలు కన్న అనేక కుటుంబాలు ఇలాంటి సదుపాయాల కోసం ఎదురు చూశారు. కానీ నెరవేరలేదు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఇది ఉంది. గడిచిన కాలంలోని పాలకులు, ప్రభుత్వాలు మన రాష్ట్రంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఇంత సంపన్నమైన రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో అక్షరాసత్య ఉంది. కేరళ మొదటిస్థానంలో ఉంది. ఏపీ 22వ స్థానంలో ఎందుకు ఉంది. ఇది ఆలోచన చేయాలి. గడిచిన 70 ఏళ్ల క్రితమే జగన్‌ లాంటి వ్యక్తి ఏపీకి వచ్చి ఉంటే తల్లిదండ్రుల స్థితి, పిల్లల పరిస్థితి జీవన ప్రమాణాలు ఇలా ఉండేవా? ఇవాళ ఇచ్చిన ప్రాధాన్యత 50 ఏళ్ల క్రితం ఇచ్చి ఉంటే ప్రతి కుటుంబంలోని జీవన ప్రమాణాలు అత్యున్నత స్థానంలో ఉండేవి. ప్రతిపక్షాలు, అవగాహన లేని వ్యక్తులు ఇదేదో డబ్బులు పంచే కార్యక్రమం అనుకుంటున్నారు. ఇది అలాంటిది కాదు. సంపన్న వర్గాలు కూడా సరిగా ఆలోచన చేయాలి. సమాజంలోని అట్టడుగు వర్గాల కుటుంబాలకు 75 సంవత్సరాల తరువాత కూడా రాజ్యాంగంలో ప్రసాధించిన హక్కులు పొందలేకపోతే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా? అది ఆలోచన చేసి జగన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే అమ్మఒడి గురించి ఆలోచన చేసి అమలు చేస్తున్నారు. - ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి



ధనవంతుల పిల్లలు చదువుకునే విధంగా పేద పిల్లలు కూడా చదువుకోవాలని సీఎం జగన్‌ ఆలోచన చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఎన్నికల ముందు పంచిన డబ్బులు కాదు. ఎన్నికలు అయిన వెంటనే ప్రారంభించిన కార్యక్రమం అమ్మ ఒడి పథకం. ఇవాళ మూడో విడత అమ్మ ఒడి కింద పేద కుటుంబాలకు సాయం అందజేస్తున్నారు. ఇదే లేకపోతే తమ పిల్లాడి కడుపు పోషించుకునేందుకు, ఆకలి తీర్చుకునేందుకు కూలి పనికి పంపించేవారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగకూడదు. అందుకే సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం ఒకప్పుడు ఉన్న ప్రభుత్వాలు తీసుకుని ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి భిన్నంగా ఉండేదన్నదే నా అభిప్రాయం. సంపన్నులు, ప్రతిపక్షాలు ఈ పథకాలను విమర్శించడం భావ్యం కాదు. ఇంతవరకు చేసిందే తప్పిదాలు. ఒక నాయకుడు సరిగా ఆలోచన చేసి అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు సరికాదు. పత్రికల్లో, ఇతర వేదికల్లో విమర్శలు చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. సమసమాజం ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను సంపన్నవర్గాలు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. - ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి



రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాను అభివృద్ధి చేశారు. మాకు వనరులు ఉన్నాయి. అన్ని ఉన్నాయి కానీ, దురదృష్టవశాత్తు గత పాలకులు సరిగ్గా దృష్టిపెట్టలేదు. రాజశేఖరరెడ్డి హాయం తప్ప మిగిలిన వారు సరిగా పట్టించుకోలేదు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్దానం ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కోసం నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది నిజం కాదా? కిడ్నీ వ్యాధులపై అనేక మంది స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఐదేళ్లు పాలన చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.250 కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. రోగులకు డబ్బులు ఇచ్చి శాశ్వత పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిగా జగన్‌ను ఎంతో ఆరాధిస్తున్నారు. - ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి



వంశధార ప్రాజెక్టు ప్రాణప్రదానమైంది. మీరు తీసుకున్న చర్యలతో నేరెడు బ్యారేజీ అడ్డంకులు తొలిగాయి. మా జిల్లాకు లిప్టు ఇరిగేషన్‌ మంజూరు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. రామ్మూర్తి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈ స్టేడియాన్ని పట్టించుకోలేదు. మహేంద్ర తనయ ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి పునాది వేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని మంత్రి కోరారు. అమదాలవలస రోడ్డు నిర్మించేందుకు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోరారు. రూ.18కోట్ల పరిహారాన్ని మంజూరు చేయాలని సీఎం జగన్‌కు మంత్రి విజ్ఞప్తి చేశారు. - ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి


సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న పరిపాలన పద్ధతి ముందు తరాలకు ఆదర్శం. ఏ రాజనీతజ్ఞుడైనా ఇలాంటి ఆలోచన చేయాలి. గతంలో జరిగిన పొరపాట్లు జగన్‌ పాలనలో జరగవని, మీ వెంటే ఉంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Published at: 27 Jun 2022 01:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.