AP Govt Letter To KRMB :తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టుపై కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నారు అధికారులు.  తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ జలవనరుల శాఖ అధికారులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ కు లేఖ రాశారు. పునర్విభజన  చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని ఏపీ ఆరోపిస్తుంది. కృష్ణా బేసిన్ లో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గతంలోనూ ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని ఏపీ స్పష్టం చేసింది. 


ఇదే చివరి సమావేశం 


పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను కేఆర్ఎంబీకి సమర్పించామని తెలంగాణ ఇప్పటికే స్పష్టం చేసింది. 2022 సెప్టెంబరు 3న జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో తెలంగాణ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు డీపీఆర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కేఆర్ఎంబీను కోరారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశం జరగనుంది. ఇదే చివరి సమావేశం అని బోర్డు స్పష్టంచేసింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ, వరద జలాలు ఆర్ఎంసీని బోర్డు ఖరారు చేసింది.  చివరి రెండు సమావేశాలకు ఇరు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు. దీంతో ఇప్పటి వరకు జరిగిన సమావేశాల ఆధారంగా నివేదిక ఖరారు చేసి దానిపై సంతకాలు చేసేందుకు చివరి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎంసీ పేర్కొంది.  గతంలో ఇరు రాష్ట్రాలు అంగీకరించిన సిఫార్సులను ఈ సమావేశంలో సమీక్షించి ఒక నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ చివరి సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు రాకపోయినా, భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్ఎంసీ విఫలమైనట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపనున్నట్లు వెల్లడించింది. 


పోలవరంపై ఉమ్మడి సర్వే! 


పోలవరం ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలో అంటే 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణ రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం పడుతుంది, ఎన్ని గ్రామాలు, ఎంత భూభాగం మునిగిపోతుందో పక్కాగా తెలుసుకునేందుకు ఉమ్మడి సర్వే చేయాల్సిందేనని తెలంగాణ మరోసారి గట్టిగా తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణలోని భద్రాచలం నుండి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరు పక్కలా రాష్ట్ర పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురి అవుతాయని తమ ఇంజినీర్లు తేల్చారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఐ భేటీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. ముర్రెడు వాగు, కిన్నెరసానిలకు మాత్రమే పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో సర్వే జరిపించాలని ఈ మేరకు డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోలవరం ముంపు ప్రభావంపై వాడి వేడిగా చర్చించారు. ఏపీ నుండి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్, ఈఎన్సీ సి. నారాయణ రెడ్డి పాల్గొనగా.. తెలంగాణ నుండి నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్ కుమార్ భేటీకి హాజరయ్యారు. 


'పంపింగ్ బాధ్యతా ఏపీదే'


పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ మాట్లాడుతూ.. పోలవరంతో తెలంగాణలో 300 ఎకరాలు మునిగిపోయే అవకాశం ఉందని, ముంపు ప్రభావంపై మరింత అధ్యయనం జరిపి నివారణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే కోసం వచ్చిన ఏపీ అధికారులు.. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రెడువాగులపై పడనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరగా.. ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకుని మళ్లీ వస్తామంటూ తిరిగి వెళ్లి పోయారని మురళీధర్ గుర్తు చేశారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్ వాటర్ అడ్డంకిగా మారిందని.. దాని వల్ల ఆయా పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయని, తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలిపారు. గత సంవత్సరం జులైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40 వేల 446 ఎకరాలు వరదల్లో మునిగిపోయాయని వెల్లడించారు. అలాగే పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9 వేల 389 ఎకరాలు మునిగిపోతాయని వివరించారు. వరదలు, ముంపు ప్రభావంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘంతో అధ్యయనం చేయించాలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భేటీలో ఆయన డిమాండ్ చేశారు.