Andhra News :స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ప్రెస్‌మీట్లు పెట్టిన అంశంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. ఇరువురుపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ అబ్ధుల్ నజీర్ లేఖ రాశారు. 


నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్‌లు పెట్టారని ఆరోపణలు 


స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది.  ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం తదుపరి పరిణామాలపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ప్రెస్‌మీట్ పెట్టారు.  ప్రభుత్వ అధికారులుగా కొనసాగుతున్న వీరు అధికార పార్టీకి  అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు   ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పక్షపాత దోరణితో వ్యవహరించడం, లా ఆండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా సీఐడీ చీఫ్ సంజయ్‌తోపాటు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.  సీఐడీ చీఫ్ సంజయ్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ గవర్నర్‌కు గత నెల 23న ఫిర్యాదు చేశారు. 


గవర్నర్‌కు  ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త సత్యనారాయణ                                           


కృష్ణా జిల్లా ఆరండల్ పేటకు చెందిన ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ ప్రభుత్వ అధికారులుగా ఉంటూ ప్రతిపక్ష నేతపై వైసీపీ నేతల మాదిరిగా చట్ట విరుద్ధంగా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల్లా ప్రెస్‌మీట్‌లో వ్యవహరించారని.. నేరం చేశారని నిర్ధారణ కాకుండానే చంద్రబాబు నాయుడు నేరం చేశారని పదేపదే ఆరోపించారని సత్యనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సైతం గవర్నర్ కార్యాలయానికి పంపించారు.


ఎంక్వయిరీ చేయాలని గవర్నర్ సిఫారసు                                          


ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ ఫిర్యాదుపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. సీఐడీ చీఫ్, ఏఏజి తీరుపై ఎంక్వయిరీ చేయాలని,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. . ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ ఆదేశించారు. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల ప్రెస్‌మీట్, వ్యవహరించిన తీరుపై విచారణ జరిపాలన్నారు.