Andhra Pradesh Sand Politics :  ఏపీలో కొత్త ఇసుక విధానం ప్రారంభమయింది. అయితే ఉచిత ఇసుక అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.  ఏపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది.  ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తోంది. కానీ దాన్ని లారీలోకి లోడ్ , అన్ లైడ్ చేయడానికి, ఆ లారీని తమ ఇంటి వరకూ తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రం వినియోగదారుడే భరించాలి.  ఈ మేరకు స్టాక్ పాయింట్లలో ఎంత ఇసుక ఉందో..  కూలీ, రవాణా చార్జీలు టన్నుకు ఎంత పడతాయో ప్రభుత్వం పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది.  ఆ వివరాలను ఈ వెబ్ సైట్‌లో ఉంచుతోంది. https://www.mines.ap.gov.in/Sand/Sand_Stockyard_Report.aspx 


ఇసుక రవాణా దూరాన్ని బట్టి ఖర్చు పెరుగుతుంది. తమకు ఎంత దగ్గరగా ఉన్న స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి  ఇసుక తీసుకుంటే వినియోగదారులకు అంత తక్కువ అవుతుంది. ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఉన్న దానిప్రకారం  టన్నుకు కూలీ, రవాణా ఖర్చులు టన్నుకు అతి తక్కువగా 192 రూపాయలు ఉంటే..  అత్యధికంగా విశాఖ అగనంపూడి స్టాక్ యార్డ్ లో 1394 రూపాయలు ఉంది.  ప్రభుత్వం పూర్తిగా ఈ మొత్తాన్ని పక్కా బిల్లు ఇచ్చి ఆన్ లైన్‌లోనే తీసుకుంటోంది.  అదనంగా ఎక్కడా ఒక్కరూపాయి వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులు ఉండరు. 


వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తాము ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పామని ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక అంటే తవ్వి తీసుకు వచ్చి మీ ఇంటి ముందు పోస్తామని చెప్పలేదుగా అని విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లపై తెచ్చుకుని ఇసుక తీసుకుంటే ఎవరికీ ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇంటి వద్దకు డోల్ డెలివరీ చేాయలంటే కూలీ ఖర్చులు.. లారీ ఖర్చులు తీసుకుంటారు. అయితే దీన్నే ఇసుకకు డబ్బులు వసూలు చేయడంగా ప్రచారం చేస్తూండటంతో సమస్య వస్తోంది.                                                                   


మరో వైపు ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకనే ఉచితంగా ఇస్తున్నారు.  ఇంకా ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభించలేదు. స్టాక్ పాయింట్లలో ఇసుక పోయిన తర్వత రీచులలో అవకాశం కల్పిస్తారు. అప్పుడు ఇంకా ఇసుక రేటు తగ్గే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇసుక విధానంతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని.. వారి ఇంటి నిర్మాణం బడ్జెట్‌లో ఎంతో కొంత తగ్గుదల కనిపిస్తుందని గుర్తు చేస్తున్నారు.