Another Cash Incentive to Grama Ward Volunteers: గ్రామ వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వారికి ఏటా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో నగదు పురస్కారాలు అందిస్తుండగా.. మరో నజరానా ప్రకటించింది. 'వాలంటీర్ల అభినందన కార్యక్రమం - 2024' పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. వీరి ఎంపిక కోసం జిల్లా స్థాయి కమిటీలను సర్కారు నియమించింది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు.


ఎంపిక ఇలా


వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో చక్కని పని తీరు కనబరిచిన వాలంటీర్లను గుర్తించి ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలం, పట్టణం, జోనల్, నియోజకవర్గం, జిల్లాకు ఒకరిని చొప్పున కమిటీ ఎంపిక చేయనుంది. ఫిబ్రవరి మూడో వారంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఎంపికైన వాలంటీర్లను సత్కరించనున్నారు. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందించనున్నారు.


వాలంటీర్ల ఆందోళనతో


రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా గ్రామ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. తమకు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. దీంతో వారికి ఊరట కల్పించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లకు ప్రతి ఏటా ఉగాది సమయంలో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో పాటు క్యాష్ అవార్డులు కూడా ఇస్తోంది. అయితే, వీటికి అదనంగా ఈ క్యాష్ రివార్డు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇప్పటివరకూ రూ.5 వేలుగా ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ఇటీవలే రూ.750కు పెంచింది. ప్రజలకు ఇంటి వద్దకే పింఛన్ సహా ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తున్నందున వారికి జీతాలు పెంపు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.


Also Read: Rayapati Politics: రాయపాటి ఫ్యామిలీలో విభేదాలు, తమ దారెటో చెప్పిన రాయపాటి శ్రీనివాస్