TDP Chief Chandrababu | అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తమ కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ (YSRCP) కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కూటమి విజయం కోసం మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena chief Pawan Kalyan)తో పాటు నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. 


కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు పలు జాగ్రత్తలు 
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో జూమ్ కాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కూటమి నేతలు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వారికి కీలక సూచనలు చేశారు. ‘శనివారం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కాబోతోంది. ఈ ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని మొదలుపెట్టారు. 



పోస్టల్ బ్యాలెట్ ఓట్ల డిక్లరేషన్ పై ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సైతం కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని వైసీపీ చూసింది. ఇదే విధంగా జూన్ 4 కౌంటింగ్ రోజు వైసీపీ శ్రేణులు పలు  అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు ఆరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకుని, అధికారులు నిబంధనలు పాటించేలా పని చేయాలి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలి. మొత్తం ఫలితాల ప్రక్రియ ముగిసేవరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దు. ప్రతి ఏజెంట్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావాలి - చంద్రబాబు 


 



అభ్యర్థులు లీగల్ టీంలను అందులో ఉంచుకోవాలి


రాష్ట్రంలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందన్నారు బీజేపీ జనరల్ సెట్రకరిటీ అరుణ్ సింగ్. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 53 శాతం ఓట్లతో భారీ సీట్లు సాధించి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఓట్ల లెక్కింపులో అనుమానాలు ఉంటే వెంటనే రీకౌంటింగ్ అడిగాలని కూటమి అభ్యర్థులకు ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ, జూన్ 4న ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందన్నారు. అందుకే కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని పురంధరేశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ సూచించారు.