ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. 


దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, బుధవారం భారీవర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు.


మంగళవారం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అన్నారు. 


సోమవారం రాత్రి 7 గంటల నాటికి జిల్లా వారీగా విశాఖ జిల్లా ఆనందపురంలో 96 మి.మీ,  పెందుర్తి 84, పద్మనాభం 76 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ లో 61.5 మి.మీ, అల్లూరి జిల్లా అనంతగిరిలో 61.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట 56.5 మి.మీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 55.7 మి.మీ, నెల్లూరుజిల్లా అనుమసముద్రం పేటలో 55.5 మి.మీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 49.7 మి.మీ, మన్యం జిల్లా సాలూరులో 47.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.


గోదావరిలో వరద తాకిడి ఇలా


సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లు  ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  9.12  లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండీ డా.బిఆర్ అంబేడ్కర్ తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ  సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం, పి.గన్నవరంలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు.