దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని శుక్రవారం మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు, పోలీసులు సైతం భద్రతా కట్టుదిట్టం చేశారు. 


వైభవంగా దసరా ఉత్సవాలు


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్టోబర్ 15న ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 24 వరకూ కొనసాగనున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం మహా చండీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 


వివాహ వేడుకకు సీఎం హాజరు


సీఎం జగన్ గురువారం మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మేనకోడలు వివాహ వేడుకకు హాజరయ్యారు. విజయవాడ సమీపంలోని కంకిపాడులో ఈ వేడుకల జరగ్గా, హాజరైన సీఎం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట వైసీపీ నేతలు, అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సీఎంవో ట్వీట్ చేసింది.