CM Chandrababu Speech On Amaravathi: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని.. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం అమరావతి (Amaravathi) నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం పూర్తైతే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చిరునామా. ఆ తర్వాత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన చూశాం. రాజకీయాలకు పనికిరాని, అర్హత లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో ప్రత్యక్షంగా చూశాం. అందుకే జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని ప్రజలు తిప్పికొట్టారు. ఇటీవల ఎన్నికల్లో కూటమికి కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ హయాంలో అమరావతి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. 1631 రోజులు ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అపార నమ్మకంతో ఆ పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు.' అని చంద్రబాబు అన్నారు.


అమరావతిపై వైట్ పేపర్


అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన మట్టి అకక్డే ఉండిపోయిందని.. కనీసం 80 శాతం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఎన్నో పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామని.. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడిందని అన్నారు. ఐదేళ్లలో అమరావతికి భూములిచ్చిన రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.


'పోలవరం రాష్ట్రానికి వరం'


పోలవరం రాష్ట్రానికి వరమని.. కానీ వైసీపీ పాలనలో పోలవరం అది శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. 'పోలవరం పూర్తైతే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును గోదారిలో కలిపేసింది. కేంద్ర నిధులతో పోలవరాన్ని కట్టి, నధుల అనుసంధానం వంటి విధానాలు, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోలవరం సందర్శించాక చాలా బాధేస్తోంది. జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రారంభమైంది. వైసీపీ పాలనలో అమరావతిలోని నమూనాలను కొన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. ఇక్కడి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడ కట్టిన బిల్డింగులు అక్కడే ఉన్నాయి. ఐకానిక్ కట్టడాలన్నీ అలానే నిలిచిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మచెట్లు మొలిచాయి. కేంద్ర ప్రోత్సాహంతో రాష్ట్రంలోని 11 కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి స్పష్టమైన విధానం ప్రకటించాం.' అని వివరించారు.


'3 ముక్కలాట ఆడారు'


'వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడింది. అమరావతి బ్రాండ్ దెబ్బతీయాలని చూశారు. విషం చిమ్మి సింగపూర్ కన్సార్టియం తరిమేశారు. స్వచ్చందంగా రైతులు భూములిస్తే ఎన్నో అవమానాలకు గురి చేశారు. రాజధాని ఏదీ అని చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలి.  కర్నూలును ఆధునిక నగరంగా తయారుచేయాలి. రుషికొండను నాశనం చేశారు. ఎన్నో అప్పులు చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. గత సీఎంలు అభివృద్ధి చేశారు. జగన్‌లా ఎవరూ చేయలేదు.' అని సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


 


Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన - ప్రజావేదిక కూల్చేసిన చోటు నుంచే ప్రారంభం, శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం