Chandrababu AP Cabinet News | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో ఆరు కీలక పాలసీలకు ఆమోదం లభించింది. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాకు మొదటి అంతస్తులో కేబినెట్ భేటీ జరిగింది. నేడు ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు మీడియాకు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, గ్రీన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎనర్జీ, పాలసీలు తీసుకొచ్చామన్నారు. దాంతోపాటు ఏపీలో పర్యాటక, ఐటీ, వర్చువల్‌ వర్కింగ్‌ పాలసీలు తీసుకువస్తామని చెప్పారు. ఏపీలో వన్‌ ఫ్యామిలీ- వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ నినాదంతో వేగంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కేవలం ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని చంద్రబాబు సూచించారు. 


ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన 6 పాలసీలు ఇవే 
1. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ  రూపకల్పనకు ఆమోదం
2. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం
3. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 (2024 – 2029)  ఆమోదం
4. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 
(2024 – 2029) ఆమోదం
5.  'ప్లగ్ అండ్ ప్లే' ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 4.0 (2024-29)తో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి నూతన పాలసీకి ఆమోదం
6. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 (2024 – 2029) కి ఆమోదం


 


7. కృష్ణా జిల్లా మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఏపీఐఐసీ ప్రతిపాదించిన ప్రణాళికకు ఆమోదం
8. దాదాపు 150 ఎకరాల్లో అందుబాటులో ఉన్న ప్లాట్లను 349 మంది కేటాయింపుదారులకు తిరిగి కేటాయించడంతో పాటు లేఅవుట్‌ను క్రమబద్ధీకరించడం జరుగుతుంది. 
9. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కులో ప్లాట్ల రేట్లపై  కేటాయింపుదారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం గతంలో జారీచేసిన G.O.Ms.No.78 I&C Dept., Dt.19.05.2017లో నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరం రూ.16.50 లక్షలకు కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
10. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద మల్లవల్లిలో మౌలిక సదుపాయాల కల్పన పనులకుగాను రూ.1,000 కోట్ల రుణానికి ప్రభుత్వ హ్యండ్ హోల్డింగ్ కు ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
11. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకై మంత్రుల బృందాన్ని( క్యాబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం 
12. ధరల పర్యవేక్షణ, నియంత్రణ , మార్కెట్ లో జోక్యంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అక్రమ మద్యం, బాధితుల పునరావాసం వంటి తదితర అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు సిఫార్సులు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
15. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏపీ ఏఎన్టీఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు 26 జిల్లాల్లో  నార్కోటిక్స్ పోలీసు బృందాలు ఏర్పాటుకు చేసే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
16. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లాల్లో 5 ప్రత్యేక కోర్టులు  లేదా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు చర్యలు.
17. చెత్త పన్ను రద్దుకు కేబినెట్ తీర్మానం..
18. గ్రామీణ, పంచాయితీ, పట్టణ రహదారుల పై ఎక్కడా గుంతలు లేకుండా ఉండే విధంగా గత క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రహదారుల మరమ్మత్తులకు చేపట్టిన పనుల ప్రగతిని తెలిపే స్టేటస్ నోట్ కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
19. గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలనే తక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది.