CM Jagan : ఏపీలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొట్టామని సీఎం జగన్ అన్నారు. విద్యారంగంలో నాడు-నేడుపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంలో కొంతమంది ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో స్కూళ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయనేది ఒకసారి పరిశీలించాలని సూచించారు. 


12 రకాల మార్పులు 


"ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ వైపు అడుగులు వేస్తుంటే ఏపీలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అడ్డుకుంటున్నారు. పేద ప్రజల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలనే లక్ష్యం ప్రభుత్వానిది. ప్రతీ కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలంటే నాణ్యమైన విద్య ఎంతో అవసరం. విద్యా హక్కు ద్వారా రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, రైట్ టు హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మన బడి నాడు-నేడు పథకం ద్వారా ప్రతి ప్రభుత్వ  బడుల్లో 12 రకాల మార్పులు చేశాం. ఎవరి కోసం చంద్రబాబు ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయకుండా ఉన్నారు?. " - సీఎం జగన్ 


కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా 


ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు తన సొంత గ్రామం నారావారిపల్లెలోని పాఠశాలలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కుప్పంలోని ప్రభుత్వ బడులు దీనావస్థలో ఉండేవన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలను గాలికొదిలేశారని ఆరోపించారు. మన బడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేశామన్నారు. నాడు-నేడు ద్వారా 57 వేల పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ఉన్నత విద్యను హక్కుగా మార్చామని స్పష్టం చేశారు​. 


రెండో దశలో 22 వేల పాఠశాలల అభివృద్ధి 


నాడు-నేడు మొదటి దశలో 15,717 బడులను అభివృద్ధి చేశామని సీఎం జగన్ తెలిపారు. రెండో దశలో 22 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిర్మాణంతో పాటు నిర్వహణపై దృష్టిపెడుతున్నామన్నారు. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయల నిర్వహణకు ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నామన్నారు. అమ్మ ఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు అని సీఎం జగన్ అన్నారు.  అమ్మ ఒడితో మూడేళ్లలో 84 లక్షల మంది పిల్లలకు లబ్ది అందించామన్నారు.  అమ్మ ఒడి పథకానికి రూ.17 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు.  జగనన్న గోరుమద్దు పథకంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గోరుముద్ద పథకానికి ఏటా రూ.1800 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 


Also Read : Minister Roja : డేటా చౌర్యం బాబా డేరా బాబా కన్నా పెద్ద దొంగ- మంత్రి ఆర్కే రోజా


Also Read : Pegasus House Committe : డేటా చోరీ జరిగిందన్న హౌస్ కమిటీ - రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యుల డిమాండ్ !