AP Assembly Session : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ నేతలు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. ఆ తర్వాత జాబ్ ఎక్కడ జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై మంత్రి మేరుగ నాగార్జున అభ్యంతర వ్యాఖ్యలు చేశారని టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు వాగ్వాదం జరిగింది.  నువ్వు దళితులకే పుట్టావా అంటూ మంత్రి అన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.  మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభ్యుల పుట్టుక గురించి అధికార పార్టీ నేతలు ప్రస్తావించడం సరికాదన్నారు. మంత్రి వ్యాఖ్యలపై  ఎమ్మెల్యే సహా టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


టీడీపీ ప్రివిలేజ్ మోషన్ 


టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో వివాదానికి దారితీసింది. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అభ్యంతర వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ మోషన్‌ ఇచ్చారు. మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కులాన్ని ప్రస్తావించి మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ టీడీపీ సభ్యుల్ని తాను ఏమీ అనలేదని తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లో ఉన్నాయని, రికార్డులు చెక్ చేస్తే ఆ వ్యాఖ్యలు బయటపడతాయన్నారు. మంత్రి ఆ మాట అనలేదంటే తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి సవాల్ విసిరారు.  


మేరుగకు మంత్రుల మద్దతు 


"మంత్రి మేరుగ నాపై చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారనుకున్నాను. నా పుట్టుక గురించి ఆయన అసెంబ్లీ మాట్లాడటం సరికాదు’’ అని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి అన్నారు. మేరుగ నాగార్జునకు ఇతర మంత్రులు మద్దతుగా నిలిచారు. మంత్రి మేరుగ నాగార్జునను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి బాబు అన్నారు. బాలవీరాంజనేయ స్వామి హద్దు దాటి మాట్లాడుతున్నారన్నారు. ఎవరైనా దళితుల కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడతారా అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారని మంత్రి బుగ్గన్న శాసనసభలో గుర్తుచేశారు.  


చంద్రబాబు డైరెక్షన్ లో 


చంద్రబాబు డైరెక్షన్‌లో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారన్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే అన్నారు. అసెంబ్లీలో తాను తప్పుగా మాట్లాడలేదని బాల వీరాంజనేయస్వామి బాధ్యతారహితంగా మాట్లాడారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కావాలనే రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారని, అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దని అంబటి రాంబాబు అన్నారు. 


Also Read : AP Assembly BAC : రాజకీయ విమర్శల్లో కుటుంబసభ్యుల జోలికెందుకు ? ఆపేద్దామని అచ్చెన్నకు సీఎం జగన్ సలహా !