Kamal Hasan Unveils Super Star Krishna Statue at Vijayawada: విజయవాడలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని (Ghattamaneni Krishna Statue) ప్రముఖ నటుడు, పద్మభూషణ్ కమల్ హాసన్ (Kamalhasan) శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జీ దేవినేని అవినాష్ (Devineni Avinash) తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) అభిమానులు పాల్గొన్నారు. కాగా, 'ఇండియన్ - 2' సినిమా చిత్రీకరణ కోసం కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. ఇందులో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.


తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 'తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ. ఆయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేశ్ బాబు అటు సినీ రంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తండ్రి పేరు నిలబెడుతున్నారు.' అంటూ ప్రశంసించారు. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండే కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహావిష్కరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. నగర ప్రజలు, కృష్ణ, మహేశ్ బాబు అభిమానుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసేలా సహకరించిన సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Also Read: Chandra Babu Case Update: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ - హైకోర్టు కీలక నిర్ణయం