Chandrababu Naidu Bail Petition News : స్కిల్ స్కాం కేసులో (Skill Scam Case) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం, ఈ నెల 15కు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మరింత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించగా, తోసిపుచ్చిన న్యాయస్థానం 15కి వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. 


మరోవైపు, అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ పిటిషన్ పైనా విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని సీఐడీ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ నెల 22కు విచారణ వాయిదా వేసింది.


క్వాష్ పిటిషన్ పై తీర్పు అప్పుడే


స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైనా సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. పాత ఆర్డర్ ప్రకారం పండుగ సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది. తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కోర్టుకు దీపావళి సెలవులు. 19న ఆదివారం కాగా, 20న కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ వారంలో స్కిల్‌ కేసు తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. 


ఫైబర్ నెట్ కేసులోనూ


అటు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సీఐడీని ఆదేశించింది. సెక్షన్ 17ఏ నిబంధన ఫైబర్ నెట్ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించగా, సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున సగం విచారించిన జాబితా కిందకు తీసుకుంటున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.


ఇదీ ఫైబర్ నెట్ కేసు


ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొంటూ చంద్రబాబుపై అభియోగం మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారంటూ.. 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సీఐడీ.. మొత్తం 19 మందిపై అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్​ను ఏసీబీ, హైకోర్టులో కొట్టివేయగా.. ఆయన సుప్రీంను ఆశ్రయించారు.




 



Also Read: Weather Latest Update: ఏపీలో ముగిసిన వర్షాలు, మళ్లీ మూడో వారంలో అల్పపీడనం - తెలంగాణలో ఇలా: ఐఎండీ