AP School Bandh: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(TNSF), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(AISF)తో పాటు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆయా సంఘాల నేతలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. సోమవారం వారు మాట్లాడుతూ.. యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు.  ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వం రూపొందించిన ఫీజులను అమలు చేయడం లేదని అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలన డిమాండ్ చేశారు.


విద్యార్థులపై ప్రభుత్వం భారం మోపుతోందని పెండింగ్‌ ఉన్న విద్యా దీవెన, వసతి దీవెనను విడుదల చేయాలని టీఎన్‌ఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యార్థులకు చదువు చెప్పే వారే లేరని విమర్శించారు. ఖాళీగా ఉన్న 53 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 77ను రద్దు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని, సంక్షేమ హాస్టళ్లు ఆధునీకరించాలని కోరారు. తెలంగాణ తరహాలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. 


వీటితో పాటు విద్యార్థుల ఇతర సమస్యల పరిష్కారానికి జులై 25న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌళిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మెస్‌ ఛార్జీలు పెంచాలని, కాస్మోటిక్‌ ఛార్జీలు ఇవ్వాలన్నారు. వసతి గృహాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్‌, అటెండర్‌, వాచ్ మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.


కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ సోమవారం చేశాయి. మహిళల వసతి గృహాలకు రక్షణ గోడలు లేవని, వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి తక్షణమే నిర్మించాలన్నారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని, సెంట్రల్‌ వర్సిటీకి నిధుల కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాడ్ చేస్తూ మంగళవారం బంద్ నిర్వహించనున్నారు.  బొబ్బిలిలో ప్రభుత్వ కాలేజీ రాజాంలో ఐటీఐలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించేలా మంగళవారం విద్యా సంస్థల బంద్‌ కు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. స్కూల్ ఫీజులను ఇస్టానుసారం పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని విమర్శించారు. విద్యా సంస్థల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న బంద్‌ను విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాలు బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial