ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో  చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. ఎటువంటి ప్రమోషన్స్ లేకున్నా రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలా రీసెంట్ టైమ్స్ లో ఓ చిన్న సినిమాగా విడుదలై సంచలనాన్ని క్రియేట్ చేసింది 'బేబీ'. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమాలో ఉన్న కంటెంట్ గురించే ఇప్పుడు ప్రతిచోట డిస్కషన్ జరుగుతోంది. సినిమాలో చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఉంది. ప్రస్తుతం యువతరం ప్రేమ పేరుతో ఎదుర్కొంటున్న పరిస్థితులను కల్ట్ వే లో ప్రెజెంట్ చేశారు.


అలాగే సినిమాపై ఇంత డిస్కషన్ జరగడానికి సినిమాలో నటీనటుల క్యారెక్టరైజేషన్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన కిరాక్ సీత తన ఆన్ స్క్రీన్ నెగిటివ్ క్యారెక్టర్ వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. తాజాగా ఓ యూట్యూబ్  ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత.. ఓ ఈవెంట్ కి వెళ్ళొస్తున్న సమయంలో కొంతమంది అబ్బాయిలు తనను ఫాలో అయ్యారని చెప్పింది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని, కానీ తాను అలా చేయలేదని చెప్పింది. అంతేకాకుండా తనకి కూడా రేప్ చేస్తామంటూ, చంపేస్తాం అని బెదిరింపులు, చాలామంది తన అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


కానీ వాటన్నింటినీ తను లైట్ తీసుకున్నానని, ఎందుకంటే అవన్నీ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎలాంటి సంబంధం లేకపోవడంతో వాటిని పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రను రాసిన విధానం వల్ల తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని దర్శకుడు తనకు ముందే చెప్పారని పేర్కొంది. దీంతో ప్రస్తుతం సీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ రోజుల్లో కొంతమంది సినీ ఆడియన్స్ సినిమాని సినిమాలా చూడడం లేదు. సినిమాపై అతిగా స్పందించడం, సినిమాలో ఏ అమ్మాయి అయినా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే రియల్ లైఫ్ లో కూడా ఆ అమ్మాయిని అలాగే అనుకుని టార్గెట్ చేస్తున్నారు. అలా జరిగిన వాటిల్లో ఈ సంఘటన కూడా మరో ఉదాహరణగా నిలుస్తుంది.


ఇక 'బేబీ' విషయానికొస్తే.. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. విరాజ్ అశ్విన్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.55 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.


Also Read : ఆ హీరో పెదాలు పగిలేలా ముద్దుపెట్టిన కంగనా? హృతిక్ తర్వాత అతనా అంటూ క్వీన్ సెటైర్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial