ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్దానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. శాసన సభ్యుల కోటా నుండి అభ్యర్ధుల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అభ్యర్దులను సైతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందడి....
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగా సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.
6నుండి 13 వరకు సెలవుదినాలు మినహా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు.ఎంఎల్సి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న  అభ్యర్ధులు స్వయంగా గాని లేదా వారి ప్రతిపాదకుడు గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన తన వద్ద గాని, లేదా సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉపకార్యదర్శికి గాని వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన ఉదయం 11గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


ఈనెల 16న మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేషన్ల ఉసంహరణకు గడువు ఉంటుందని ఆగడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించు కోవాలనుకుంటే అభ్యర్ధిత్వ ఉపసంహరణ నోటీసును స్వయంగా అభ్యర్ధి ద్వారా కాని , లేదా అభ్యర్ది తరపున ప్రతిపాదకుడు ద్వారా పంపవచ్చని, రాత పూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు గాని రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి గాని అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే, ఈనెల 23వేతదీ ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అనగా 23వతేదీ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే అభ్యర్దుల ప్రకటన...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అదికారంలో ఉండటంతో పాటుగా మోజార్టీ 151 స్దానాలను దక్కించుకోవటంతో ఇప్పుడు ఖళీ అవుతున్న ఎమ్మెల్సీ స్దానాలకు కు అభ్యర్దులను పార్టి నాయకత్వం ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని ఖాళీ స్దానాలకు కలపి మెత్తం 18 ఎమ్మెల్సీ స్దానాలకు త్వరలో కొత్త అభ్యర్దులు రానున్నారు.