Warangal Medico Preethi Death Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ ను సోమవారం పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలోనే సైఫ్ పోలీసు కస్టడీని పొడగించాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు పోలీసుల పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక ఇప్పటి వరకు ఇచ్చిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే రేపటి విచారణ ఉన్న కారణంగా సైఫ్ ను మళ్లీ ఖమ్మం జైలుకు తరలించారు.


ప్రీతి కేసు విషయమై తెలంగాణ డీజీపీ ఆఫీసుకు ప్రీతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రతీ కేసు గురించి డీజీపీ అంజనీ కుమార్ తో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రతీ తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యేనని కామెంట్లు చేశారు. టాక్సికాలజీ రిపోర్టు తమకు ఇవ్వలేదని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే బ్లడ్ ఎక్కించిన తర్వాత శాంపుల్స్ ను టాక్సికాలజీ కోసం పంపించారని... ఇప్పటికే డయాలసిస్ కూడా పూర్తయిందని అన్నారు. 


హత్యా? ఆత్మహత్యా?.. అసలు ప్రీతికి చేసిన ఇంజెక్షన్ ఏంటి


ప్రీతిది హత్యా? లేదా ఆత్మహత్యా? అనే అనుమానాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ తెరదించనుంది. తమ కూతురిని సైఫ్ హత్య చేశాడని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తండ్రి చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు కూడా పంపామన్నారు. ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయిందనుకుని సైఫ్ వెళ్లాడని, అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించినట్లు చెబుతున్నారు. దీంతో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారింది. ప్రీతి బాడీలోని ఇంజెక్షన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అది ఏం ఇంజెక్షన్ అనేది వైద్యులు లేదా పోలీసులు బయటపెట్టలేదు. ప్రమాదకరమైన ఇంజెక్షన్ అని చెబుతున్నా.. ఆ ఇంజెక్షన్ పేరు ఏంటనేది బయటకు రాలేదు.


కీలకంగా స్క్రీన్ షాట్స్, ఆడియో కాల్స్ 


ఫోరెన్సిక్ రిపోర్టులో వివరాలన్నీ ఉండే అవకాశముందని చెబుతున్నారు పోలీసులు. ప్రీతి ఆత్మహత్య కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఒత్తిడితోనే ప్రీతి చనిపోయినట్లు కాలేజీ యాజమాన్యం చెప్పగా.. ఆ తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళనలతో సైఫ్ వేధింపుల వల్ల చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి ముందే చెప్పడం, సైఫ్ వాట్సప్ మెసేజ్‌లు బయట పడటంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి వాట్సప్ ఛాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఆడియో కాల్స్ ఆధారంగా సైఫ్‌ను విచారిస్తున్నారు. సుదీర్ఘంగా అతడిని అన్ని విషయాలు అడుగుతున్నారు. సైఫ్ విచారణలో పలు కీలక విషయాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది. వాటిని త్వరలో పోలీసులు బయటకు వెల్లడించే అవకాశముంది. ఈ క్రమంలో ఫోరెన్సిక్ రిపోర్టు అత్యంత కీలకంగా మారిందని చెప్పవచ్చు.