Visakha Global Investors Summit  : విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మార్చి 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. 


మాతో కలిసి పనిచేయండి 


విశాఖలో జరగనున్న సమ్మిట్‌ ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలు ఆహ్వానించారు. ఈ సమ్మిట్ "భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే లక్ష్యంతో" అనే నినాదంతో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ  ఈవెంట్‌కు హాజరు కావాలని "మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి" "మాతో కలిసి పని చేయమని" అందరికీ ఆహ్వానాన్ని అందించారు. 2019 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కోరుతూ విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించింది.


ప్రభుత్వ సహకారం 


2022లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్రం అందిస్తున్న సహకారాన్ని 2023లోనూ కొనసాగిస్తామని  వైసీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబోయే పెట్టుబడుల కోసం నిర్దిష్ట లక్ష్యం నిర్దేశించనప్పటికీ, వివిధ రంగాల్లోకి రూ. 5-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పరిశ్రమ సంఘాలు, వాణిజ్య సంస్థలను దీర్ఘకాలిక భాగస్వామ్యం చేసేందుకు ఈ సమ్మిట్  వేదిక కానుందన్నారు. ఈవెంట్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B) , గవర్నమెంట్-టు-బిజినెస్ (G2B) సమావేశాలు,  గ్లోబల్ లీడర్‌లకు అవకాశాలను ప్రదర్శించడానికి సెక్టార్- ప్లీనరీ సెషన్‌లు ఉంటాయి. వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్,  ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, MSMEలు టూరిజం వంటి వాటిపై  దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.


సమ్మిట్ ప్రచారం కోసం రోడ్ షోలు 


జీఐఎస్ ను ప్రచారం చేయడానికి ఏపీ ప్రభుత్వం జర్మనీ (జనవరి 20-26), జపాన్ (జనవరి 25-27), దక్షిణ కొరియా (జనవరి 30-31) , USA (ఫిబ్రవరి 6-10)లలో రోడ్‌షోలు నిర్వహిస్తుంది. UAE , తైవాన్‌లలో కూడా రోడ్‌షోలు నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ రోడ్‌షోను దిల్లీలో జనవరి 10-14 వరకు, ఫిబ్రవరి 3న ముంబయిలో నిర్వహించనున్నారు. బెంగళూరు, చెన్నై , హైదరాబాద్‌లలో ఈవెంట్‌ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.