AP New DA : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెల నెలా వచ్చే కరవు భత్యాన్ని (డ్రాట్ అలవెన్స్) 3.144 శాతం చొప్పున పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఉద్యోగుల కరవు భత్యం వారి కనీస (బేసిక్‌) జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకున్నట్లయింది. అయితే, ఈ పెంచిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు. తాజాగా పెంచిన డీఏతోనే జులై నెల జీతాలు, పింఛన్లను ఇవ్వనున్నారు. 


అయితే, 2019 జనవరి నుంచి డీఏను పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి 2021 జూన్‌ వరకు ఉన్న డీఏ బకాయిలను పింఛను దార్లకు, సీపీఎస్‌ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు. అలాగే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) ఉన్న ఉద్యోగులకు కూడా బకాయిలను మూడు విడతలుగా వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు.


Also Read: Case On JC : మీసం మెలేసినా కేసు పెడతారా..? జేసీ ప్రభాకర్ పై పెట్టిన కేసులో నిజమేంటి..?


హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) గడువు కూడా పెంపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ)ను ఇంకో ఏడాది పాటు కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది. హైదరాబాద్‌లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) అమల్లో ఉండనుంది.


సంతోషం వ్యక్తం చేసిన ఉద్యోగులు
కరవు భత్యం పెంపు, బకాయిల చెల్లింపుతోపాటు 30 శాతం హెచ్‌ఆర్‌ఏను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ మేరకు వారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని వారు అన్నారు. ఉద్యోగుల సమస్యలను గురువారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకటరామి రెడ్డి మీడియాతో అన్నారు.


Also Read: Devineni Issue : దేవినేని ఉమకు జైల్లో హాని..! కుటుంబసభ్యులకు అనుమానం అందుకే..!?