AP Government Announcements: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ మారుతున్న తీరుకు అద్దం పడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయాలు ఇప్పుడు వార్తా పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.  సాధారణంగా పదో తరగతి లేదా ఇంటర్ ఫలితాలు రాగానే పత్రికల నిండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటనలే కనిపిస్తాయి. స్టేట్ ఫస్ట్ మాదే.. టాప్ ర్యాంకులు మావే  అంటూ భారీ కలర్ అడ్వర్టైజ్‌మెంట్లతో ఆ సంస్థలు హోరెత్తిస్తుంటాయి. కానీ, ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో విద్యాశాఖ ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడి పిల్లలు సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం విద్యా రంగంలో ఒక వినూత్న మార్పుగా నిలుస్తోంది.

Continues below advertisement

ప్రైవేటు స్కూళ్లతో  ప్రభుత్వ స్కూళ్లు పోటీ

ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం పేద విద్యార్థులు చదువుకునే చోటు మాత్రమే కాదని, అక్కడ కూడా అత్యుత్తమ విద్యాబోధన అందుతుందని ఈ ప్రకటనలు నిరూపిస్తున్నాయి. భారీ మార్కులు, ర్యాంకులు కేవలం ఏసీ గదుల్లో చదివితేనే రావు.. నిబద్ధత గల ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉంటే ప్రభుత్వ బడిలోనూ స్టేట్ టాపర్స్  తయారవుతారని విద్యాశాఖ ఈ ప్రచారంతో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, సామాన్య ప్రజల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న చిన్నచూపును తొలగించి, నమ్మకాన్ని పెంపొందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. గతంలో ప్రైవేటు స్కూళ్లలో మార్కులు రావడానికి కారణం వారి విద్యా విధానమే అన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండేవారు. కానీ, నేడు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల కృషి ఫలితంగా మార్కులు వస్తున్నాయని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. తమ పిల్లల ఫోటోలను ఇలా అధికారిక ప్రకటనల్లో చూసుకోవడం ఆ తల్లిదండ్రులకు జీవితకాలపు గర్వకారణంగా మారుతోంది. ఇది ఇతర విద్యార్థుల్లో కూడా పోటీ తత్వాన్ని, తాము కూడా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

Continues below advertisement

ప్రభుత్వ ప్రయత్నానికి ప్రశంసలు

ఈ ప్రయత్నం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. ప్రైవేటు సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ బడులే శరణ్యమని భావించేలా చేస్తోంది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మేధావులు, విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కేవలం అధికారుల మీదనే ఫోకస్ పెట్టకుండా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించినట్లు అయింది.

విద్యాశాఖలో సమూల సంస్కరణలు

ఆడంబరాలకు పోకుండా నిజమైన ప్రతిభను గుర్తించి, మా విద్యార్థులు కూడా ఎవరికీ తీసిపోరు అని ప్రభుత్వం చాటిచెప్పడం విద్యా రంగంలో ఒక గొప్ప మలుపు. ప్రైవేటు పాఠశాలల ప్రకటనల హోరులో ప్రభుత్వ స్కూళ్ల విజయగాధలు మరుగున పడిపోకుండా చూడటమే కాకుండా, సామాన్యుడికి నాణ్యమైన విద్యపై భరోసా కల్పించడంలో ఈ ఫుల్ పేజీ ప్రకటనలు విజయవంతమయ్యాయి. ఈ బాటలోనే మరిన్ని సంస్కరణలు వస్తే, భవిష్యత్తులో ప్రభుత్వ బడులే విద్యా కేంద్రాలుగా విరాజిల్లడం ఖాయం.