Pawan Kalyan : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్ముడి మాటలను స్ఫూర్తిగా తీసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించిన తర్వాత మూడు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పారు.  వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ కు కొత్త జీవం పోస్తామన్నారు. గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే తమ ప్రభుత్వ తపన అని ప్రకటించారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులను భారీగా పెంచామన్నారు. 
 


13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు
జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.  ఈ పథకం కింద గ్రామాల్లో ఏ పనులు చేయాలి..? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి..? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలి అన్న విషయాలను గ్రామ సభలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఉపాధి నిధులతో గ్రామాలకు కొత్త కళ తీసుకురావడం, ఆయా గ్రామాల్లో ఉన్న సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల పెంపు వంటి విషయాలను గ్రామ సభల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి సభ జరుగుతుందని వెల్లడించారు.  


పైపు లైన్లు వేసి వదిలేశారు
 కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామన్నారు.  వైసీపీ ఐదేళ్ల పాలనలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా, వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించటం లేదన్నారు. కొన్ని పైపు లైన్లు వేసి వదిలేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులెక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకెళ్లటంపై పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా జరిగే ఈ సర్వేలో వెలుగుచూసే అంశాలను ప్రజల ముందు పెడతామన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులను, పథకాన్ని సమర్ధంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పవన్. 
 
పండుగలా జెండావందనం  
34 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చి కొత్తగా నిధులు భారీగా పెంచుతూ జీవో విడుదల చేశామని తెలిపారు.  రాష్ట్రమంతటా పంద్రాగస్టు వేడుకలు పండుగలా జరగాలనే ఆకాంక్షతో జెండా పండుగ నిధులను పందాయతీలకు భారీగా పెంచామన్నారు. ఆగస్టు 15న జెండా వందనం గ్రామగ్రామానా పండగలా చేయాలన్నారు. 5 వేల జనాభా కంటే తక్కువగా పంచాయతీలకు రూ.100లు నుంచి రూ.10 వేలకు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.250లు నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా వారికి కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోందన్నారు. చేనేత కళాకారులు నేసిన జెండాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు.


Also Read: Duvvada Family Issue: దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్


 సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకూడదు
ఏ దశలోనూ- ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తామన్నారు. అలాగే గ్రామాల్లో ఆగష్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించేలా స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం పనిచేసిన సైనికులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకునేలా కార్యక్రమాలను నిర్వహించాలని సర్పంచులను కోరారు. స్కూల్  పిల్లలకు జెండా పండుగ విశిష్టత తెలిసేలా వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, డిబేట్, క్రీడా పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయాలన్నారు.   ఎలాంటి ప్లాస్టిక్ జెండాలు, ఇతర పర్యావరణ వినాశక అంశాలు జెండా పండుగ వేడుకల్లో లేకుండా చూడాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచి వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి కలిగించి, తిరిగి జీవం పోయాలనే తపనతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.