ప్రకాశం జిల్లా ఒంగోలులో భూ కుంభకోణం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కామ్ పై పూర్తి దర్యాప్తు వివరాలతో రావాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, కలెక్టర్ కు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో సంబంధిత దస్త్రాలతో వారు బయల్దేరారు. గురువారం బాలినేని ఫిర్యాదుతో సీఎంవో ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


సిట్ దర్యాప్తు


ప్రైవేట్ భూములపై నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో అక్రమ లావాదేవీలు జరిగాయని బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసు వైసీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పోరుగా మారింది. ఈ క్రమంలో ఇటీవల బాలినేని తన గన్ మెన్లను సర్కారుకు సరెండర్ చేశారు. ఈ విషయంపై బాలినేని గురువారం సీఎంవోకు వెళ్లి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ఈ కేసు సంగతి తేల్చేలా జిల్లా అధికారులను ఆదేశించాలని పట్టుబట్టారు. ఈ కేసులో ఎవరున్నా, చివరకు తన మనుషులైనా అరెస్ట్ చేయాలని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలకు చెప్పినా వారు స్పందించడం లేదని, అనవసరంగా తాను విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని బాలినేని సీఎం కార్యదర్శికి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో స్పందించిన కార్యదర్శి కలెక్టర్, ఎస్పీలను వివరాలతో రావాలని ఆదేశించారు. 


నకిలీ డాక్యుమెంట్లతో భూ ఆక్రమణ


ఒంగోలులో గత 20 ఏళ్లుగా భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో గత కొంతకాలంగా కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ వీలునామాలు, దస్తావేజులతో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొల్లగొడుతున్నారు. భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తాము అడిగినంత ఇవ్వకుంటే కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఈ భూదందాను అడ్డూ అదుపు లేకుండా కొనసాగిస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా రాజకీయ పలుకుబడితో మేనేజ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారాలన్నీ సివిల్ కేసులు కావడంతో కోర్టుల్లోనే చూసుకోవాలని బాధితులకు చెబుతుండడంతో వారు అక్రమార్కులతో రాజీ పడుతున్నారు. అలా కాని పక్షంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.


అధికారి ఫిర్యాదుతో


ఒంగోలులో నకిలీ పత్రాలతో కొందరు తన భూమిని ఆక్రమించుకున్నారని ఇటీవల ఓ అధికారి ఫిర్యాదు పోలీసులు కూపీ లాగగా, ఈ వ్యవహారం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి భూములు అమ్ముతున్న నలుగురు నిందితులను సెప్టెంబర్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే దీనిపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించేందుకు ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, కొందరు అనుమానితులు పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కేసులో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సహకరించినట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.


Also Read: E Challan Scam: ఏపీలో ఈ - చలానా స్కామ్ - రూ.36.52 కోట్లు దుర్వినియోగం