సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం జ‌గన్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకురావాల‌ని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేప‌ట్టి, ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు తేవాల‌ని జ‌గ‌న్ అన్నారు. గురుకులాలు, వసతి గృహాల నిర్వహణ ఖర్చులు, డైట్‌ ఛార్జీలను పెంచాలన్న సీఎం... మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో.. .ఆ స్ధాయిలో నిర్వహణ ఉండాలని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.  


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన చేయించామన్నారు సీఎం జగన్. స్వయంగా తానే ఈ విషయాన్ని పర్యవేక్షించినట్టు తెలిపారు. ఆ వివరాలు చూస్తే చేయాల్సింది చాలా ఉందని... దీనిపై ఒక కార్యాచరణ ఉండాలన్నారు. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు.  ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని, మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 


దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడన్న సీఎం జగన్... వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదన్నారు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు చేశాక వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలన్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలని ఆదేశించారు. దీని కోసం ఒక వ్యవస్థ ఉండాలన్నారు.


సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి...


హాస్టళ్ల నిర్వహణ కోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచాలన్నారు సీఎం జగన్. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండన్నారు. 


స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు సీఎం జగన్. ప్రతి హాస్టల్‌లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలన్నారు. హాస్టళ్లలో ఉండాల్సిన ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలకు ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్‌ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలన్నారు. డైట్‌ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలని, విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ ఛార్జీలను పెంచాలన్నారు. సమూలంగా డైట్‌ ఛార్జీలు పరిశీలించి ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. 


గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్‌ ఛార్జీలను పెంచిందన్న సీఎం జగన్.... అప్పటివరకూ హాస్టల్‌ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. హాస్టళ్లలో నాడు–నేడు, అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం, వాటి నిర్వహణను కూడా చేపట్టాలన్నారు. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాల‌న్నారు. వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేసి, ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు.


నాడు నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి...


ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలన్నారు సీఎం జగన్. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లను కూడా చేర్చాలని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలని, ఏడాదిలోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్నారు సీఎం. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.