ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాల అమలుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 2021-22 ఏడాది వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సొంత మగ్గంపై నేసే కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను బడ్జెట్‌లో రూ.199 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు.




అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అనధికారిక ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2019 అక్టోబరు 15 నాటికి.. 300 చదరపు గజాల వరకు ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. జోనల్‌, రహదారి అభివృద్ధి, బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ఉన్న భూములకు, ఆమోదం తెలిపిన లేఅవుట్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 75 చదరపు గజాలు, అడుగుల వరకూ ఉన్న వాటిని భూమి మూల విలువలో 75 శాతం రుసుముతో క్రమబద్ధీకరించాలని తెలిపింది. లబ్ధిదారు కేటగిరీ-1కి చెందినవారైతే  ఉచితంగా పట్టా, డీ ఫారం పట్టా పంపిణీ చేయాలని సూచించింది. 75- 150 చదరపు గజాల వరకూ భూమి మూల విలువలో 75 శాతం రుసుము, 150- 300 చదరపు గజాల వరకూ 100 శాతం రుసుముతో క్రమబద్ధీకరించేందుకు అనుమతించింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.


అసైన్డు ఇంటి స్థలం లేదా అసైన్డు ఇంటి విక్రయానికి ప్రస్తుతమున్న గడువును 20 నుంచి పదేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఏపీ అసైన్డు, భూముల చట్టానికి సవరణలను ఆమోదించింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చే నాటికి అసైన్డు స్థలం లేదా అసైన్డు ఇంటిని విక్రయించిన వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. చట్టం అమల్లోకి వచ్చిన తరువాత విక్రయించాలనుకుంటే నిర్దేశిత విధానం ప్రకారం రుసుములు తీసుకుని అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదించింది.





  • గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, పాలశీతలీకరణ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ భవనాలకు స్థలాల కొరత దృష్ట్యా ప్రైవేటు భూమిని తీసుకోవాలి. బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు ఆమోదం.

  • హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం కర్నూలుకు తరలింపు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డైరెక్టర్‌ , ఇద్దరు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు తదితర పోస్టుల మంజూరుకు ఆమోదం.

  • రాష్ట్ర మానవహక్కుల కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం.

  • మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టుల సవరించిన డీపీఆర్‌కు ఆమోదం. రూ.5,155.73 కోట్లతో 36 నెలల్లో మచిలీపట్నం పోర్టు, రూ.4,361.9 కోట్లతో 30 నెలల్లో భావనపాడు ఫేజ్‌-1 పోర్టు నిర్మించాలని లక్ష్యం.

  • శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పలో రూ.1,720.61 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం.

  • అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించేందుకు ఆమోదం.

  • క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమానికి ఆమోదం. దీనిలో భాగంగా 124 మున్సిపాలిటీల్లోని 40 లక్షల ఇళ్ల నుంచి చెత్త సేకరణ. ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100 రోజులు కార్యక్రమాలు. 

  • రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన 4 లక్షల మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు ఆగస్టు 24న రూ.500 కోట్ల పరిహారం పంపిణీకి ఆమోదం.

  • పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల పెండింగ్‌ దరఖాస్తులను మూడు నెలలకోసారి సమీక్షించి, మంజూరు.

  • వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తానికి బడ్జెట్‌లో రూ.199 కోట్ల కేటాయింపు. ఆగస్టు 10న సాయం అందజేత.

  • ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు 50 నుంచి 74 శాతం పెంపునకు ఆమోదం.

  • ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం.

  • నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి... టెక్నో ఎకనామిక్‌ ఫీజుబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం.

  • ధార్మిక పరిషత్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.

  • పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. ఇందుకోసం సుమారు రూ. 550 కోట్లు కేటాయించింది.

  • ఈనెల 13న వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు కేబినెట్‌ ఆమోదం.

  • గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్‌ పోస్టు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

  • రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ బొవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌- 2021కి కేబినెట్‌ ఆమోదం.

  • రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల పెంపు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

  • రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం.

  • ఉద్యాన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం.

  • కొత్తగా రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ


రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిలోకి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలుతో పాటు గోదావరి, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థల్లోని కొంత భాగాన్ని తీసుకురానున్నారు. 207 గ్రామాలు, 17 మండలాలు, 3 పట్టణ స్థానిక సంస్థలతో 1,566 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.