హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చెప్పట్టారు. హిందూపురం జిల్లాగా ప్రకటించని పక్షంలో ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. పుట్టపర్తిని జిల్లాగా చేస్తే పుట్టపర్తిలో కూడా ధర్నా నిరసనలు చేపట్టి జిల్లాను సాధించుకుంటామన్నారు. ఎన్.టి.ఆర్ మీద అభిమానం ఉంటే అన్న కాంటీన్ ఎందుకు తొలగించినట్టు అని వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశ్నించారు. ఎంపీ పుట్టపర్తికి మద్దతు పలికారని, ఇప్పుడు ఆ ఎంపీ ఎక్కడని బాలకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ గతంలో 30 మంది కౌన్సిలర్లను ఇస్తే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. హిందూపురాన్నే జిల్లాగా ప్రకటిస్తూ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారు. జిల్లాగా హిందూపురానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. హిందూపురం జిల్లా సాధనకు టీడీపీ కౌన్సిలర్లు, తాను రాజీనామాకు సిద్ధమని వైసీపీ నేతలు రాజీనామాలకు సిద్ధమా అని బాలయ్య సవాల్ విసిరారు. 


బాలకృష్ణ మౌనదీక్ష


హిందూపురం జిల్లా కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు.  హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మౌనదీక్ష చేపట్టారు. గురువారమే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేడ్కర్‌ సెంటర్ వరకు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత  అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో మౌనదీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ ఆయన మౌనదీక్ష  చేస్తారు. అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది.


హిందూపురం జిల్లా సాధనకై పోరుబాట


ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం వచ్చే సరికి ప్రభుత్వం పుట్టపర్తి వైపు మొగ్గు చూపడం హిందూపురం వాసుల్ని నిరాశపరిచింది. జిల్లాల విభజనకు మొదటి నుంచి మద్దతుగా మాట్లాడుతున్న బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పడంతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం మౌనదీక్ష పూర్తయిన తర్వాత ఆయన హిందూపురం నియోజకవర్గంలోని అన్ని పార్టీలు, స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలతో సమావేశం అవుతారు. అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హిందూపురం జిల్లాను సాధించాలని బాలకృష్ణ పట్టుదలగా ఉన్నారు. అందర్నీ కలుపుకని వెళ్లి పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.