AP News: ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాగే చేస్తే వేగంగా కూటమి ప్రభుత్వం దిగిపోతుందని, తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు. చంద్రబాబు ఇలా భయపెట్టే పనులు చేస్తే, చంద్రబాబును, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితులు వస్తాయని అన్నారు. వైఎస్ జగన్ మంగళవారం (ఆగస్టు 6) విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఎక్కడైనా కాస్త సమయం పడుతుందని, కానీ, చంద్రబాబుపై మాత్రం చాలా త్వరగా ప్రజల్లో విరక్తి మొదలైందని జగన్ చెప్పారు. వివిధ పథకాలను కూడా చంద్రబాబు మర్చిపోయారని అన్నారు. రైతు భరోసా సొమ్ము రెట్టింపు చేసి ఇస్తామని చెప్పి, వాటిని మర్చిపోయారని అన్నారు. బడులకు పోయే పిల్లల్ని విస్మరించి వారి తల్లులకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఎగరగొట్టేశారని విమర్శించారు.


తప్పుడు సాంప్రదాయాలను ఆపేయాలని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, ప్రశ్నించినందున వైసీపీ కార్యకర్తలు సహా మహిళలపైన కూడా అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. వచ్చే శుక్రవారం తాను నంద్యాలకు వెళ్లి అక్కడ హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని కలుస్తానని అన్నారు. ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేస్తామని అన్నారు. హైకోర్టుకే కాకుండా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ హెచ్చరించారు. 


రాష్ట్రపతి పాలన విధించాలి

’’కచ్చితంగా హైకోర్టు తలుపులు తడుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన ఘటనలు, ఇక్కడి పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు, అఘాయిత్యాలను చూసి, ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు అని హైకోర్టు, సుప్రీంకోర్టును అడిగే కార్యక్రమం చేస్తాం.

 

గవర్నర్‌ కీ విజ్ఞప్తి

ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌గారికి విన్నవిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు జస్టిస్‌గా పని చేశారు. మీరు రాష్ట్రంలో ఉండగా, మీ కళ్ల ముందే రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చూసి చూడనట్లు పోకుండా, మీరు కూడా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జగన్ మాట్లాడారు.