YS Sharmila: వైసీపీ హయాంలో విధ్వంసం జరుగుతుంటే వేడుక చూస్తూ కూర్చున్నారా? నిలదీసిన షర్మిల

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలకు రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైసీపీ పాలన ఓ విపత్తు అని నిజంగానే అనుకుంటే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని మీరు వేడుక చూశారా అని అమిత్ షాను ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా కేంద్రం నుంచి అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా ఏపీలో 5 ఏళ్లు పాలన చేస్తుంటే మీకు కనిపించలేదా ? ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు ఏపీలో అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అప్పుడు మీకు అనిపించలేదా ? సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ? నిజంగానే భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే అప్పుడు ఎందుకు బయటపెట్టలేదని షర్మిల ప్రశ్నించారు.
జగన్ దత్తపుత్రుడు, తోలుబొమ్మ
5 ఏళ్లపాటు జగన్ (YS Jagan) మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మలాంటివాడు. మీ బిల్లులకు పార్లమెంట్లో మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. ఏపీలో సహజ వనరులను 'మోదీ, అదానీ'కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీ (YSRCP)నీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు కాదు ఏపీ ప్రజ. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే... కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే అవుతుంది. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం.
అమిత్ షా ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (AP Congress) డిమాండ్ చేస్తోంది. మీ వ్యాఖ్యలు మీద మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి.