అప్పుడు బ్రింగ్ బాబు బ్యాక్ ఇప్పుడు క్విట్ జగన్... సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అమల్లోకి తీసుకురావాల‌ని టీడీసీ అధ్యక్షుడు చంద్రబాబు పిల‌పునిచ్చారు. టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కార్యక‌ర్తల‌కు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ అధినేత ప్రారంభోపన్యాసం చేస్తూ రాష్ట్రపరిస్థితులు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్... ఆహార భద్రతకు నాంది పలికి.. పేద పిల్లల కోసం గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారని గుర్తు చేశారు.  పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టింది పాలనలో సంస్కరణలు మొదలు పెట్టింది కూడా ఎన్టీఆర్‌ అని తెలిపారు. తెలుగుదేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ అని ప్రజలకు గుర్తు చెయ్యాలని కార్యకర్తలకు సూచించారు. ఆత్మగౌరవంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా అవసరం అని అభిప్రాయపడ్డారు. 


ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధగా ఉందన్నారు చంద్రబాబు. పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదన్నారు.  నేడు ఎక్కడ చూసినా విద్వేషమే... పాలకుల విజన్ పోయి పాయిజన్‌గా తయారైంది ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్లకార్డు పట్టుకుంటే ఆయన్ని టార్గెట్ చేశారన్నారు. ఉద్యోగం నుంచి తొలగించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదని చెప్పిన మహిళను వేధిస్తున్నారన్నారు. కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదని తెలిపారు. సమస్యలను ప్రస్తావిస్తే దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. నాడు విజన్‌తో చేసిన పాలన వల్ల ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉందని గుర్తు చేశారు.


ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నతి స్థితిలో ఉండడమే తనకు అన్నిటికంటే సంతృప్తి అని తెలిపారు చంద్రబాబు. 27 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న ప్పుడు చేసిన పనులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం 65 వేల డాలర్లు... కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం 1.25 లక్షల డాలర్లు అని పేర్కొన్నారు. ఇది తెలుగు వారి సత్తా అని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. విభజన వల్ల నష్టం జరిగిందన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. 200 పెన్షన్ 2000 చేశామని... ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని వివరించారు. 


జగన్ ఇప్పుడు ఒక్కో కుటుంబంపై మూడేళ్లలో 3.25 లక్షల భారం వేశారని ఆవేదన చెందారు చంద్రబాబు. దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. వృత్తి పన్ను, ఆస్తిపన్ను, చెత్త పన్ను అని ఇష్టం వచ్చినట్లు పన్నులు వేశారన్నారు. టిడిపి పెట్టిన అన్న క్యాంటీన్ రద్దు చేశారని... ఇప్పుడు అన్నదానం చేస్తున్న వారిపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు డొక్కా సీతమ్మ అన్నదానం చేశారని... అన్నదానానికి ఆమే స్ఫూర్తి అన్నారు. నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్నక్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నామని తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల మోత... అప్పుల భారమని వివరించారు. ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారని తెలిపారు. సబ్ ప్లాన్ తీసేశారని... చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగీ వచ్చి చనిపోయిందన్నారు దీనికి సిఎం ఏం సమాధానం చెపుతారన్నారు. ఇది ప్రభుత్వ హత్య కాదా అని నిలదీశారు. వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. విదేశీ విద్యను ఆపేశారని... బిసిలకు ఒక్క పథకం లేదన్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు లేవని... రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదని అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. 


రాష్ట్రంలో ఇసుక దొరక్క...భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారన్నారు చంద్రబాబు. చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారన్నారు. పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చేవారికి నో చెక్ పోస్ట్... గంజాయి తెచ్చే వారికి చెక్ పోస్ట్ లేదు... సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం, అమరావతి పూర్తి చేస్తాం అన్నారు... మద్యపాన నిషేధంతోనే చేస్తేనే ఓటు అడుగుతాం అన్నారు కానీ మద్యం అమ్మకాలపై అప్పులు తెచ్చారని సెటైర్‌లు వేశారు. 


రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై 31 శాతం దాడులు పెరిగాయని... ఈ విషయాలు నేషనల్ క్రైం బ్యూరో చెప్పిందని గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ...వైసిపి ఆదాయం మాత్రం భారీగా పెరిగిందన్నారు. జగన్ ఈ మూడేళ్లలో 2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. 


లేపాక్షిలో భూములు కొట్టేశారని.... 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లు పెట్టి వేల కోట్ల భూములు కొట్టేశారని ఆరోపించారు. సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దుపై ప్రతిపాదనలు చేశారని తెలిపారు.  సరస్వతీ భూముల విషయంలో జగన్ చేసిన దానికి ఏమి చెయ్యాలని నిలదీశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన పానెల్‌ను జగన్ రద్దు చేశారని.... హైకోర్టు చీవాట్లు పెట్టి మళ్లీ వారికే అధికారం ఇచ్చిందన్నారు.