టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి ఏడాది పూర్తవుతున్నా, నేటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై తెలుగుదేశం నేతలు ఫైర్ అవుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని ఆత్మకూరు వద్దగల టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఏడాది కిందట దాడి జరిగింది. అప్పట్లో ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వటం పై మరో నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ క్యాడర్ నేరుగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిందని ఆరోపణలున్నాయి. వైసీపీ నాయకులు కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ కార్యాలయానికి చేరుకొని అలజడి రేపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయంలోకి వచ్చి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పలు వాహనాలపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుండి పరారయ్యారు. ఈ మెత్తం వ్యవహరం అంతా పార్టీ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆధారాలతో సహ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ మండిపడుతుంది. ఈ వ్యవహరం పై టీడీపీ నేతలు డీజీపీని కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
టీడీపీ కార్యాలయంతో పాటు పలు చోట్ల దాడులు
ఏడాది కిందట జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన రాజకీయంగా దూమారాన్ని రేపింది. ఈ ఘటన తరువాత పలు జిల్లా పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది టీడీపీ ఆవేదన. అప్పట్లోనే టీడీపీ నేతలు తమ నిరసనలు వ్యక్తం చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి బుద్ది చెబుతామని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పార్టి కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన పై టీడీపీ నేతలు అప్పుడే డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై టీడీపీ న్యాయ పోరాటం కొనసాగుతోంది.


టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు ఆ పార్టికి చెందిన నేత పట్టాభి ఇంటిపై సైతం దాడి జరిగింది. పట్టాభి ఇంట్లో లేని సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కారును ధ్వంసం చేశారు. ఇంటిలోని ఫర్నిచర్, సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే టీడీపీ కేంద్ర కార్యలయం కొందరు దండుగులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేత పట్టాభి ఇంటికి వచ్చి, పరామర్శిస్తుండగానే ఇంకో వైపున పార్టీ కార్యాలయం పై దాడి జరగడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 
ఈ రెండు ఘటనల వెనుక విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన వైసీపీ నాయకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన కీలక నేతలను టీడీపీ గుర్తించింది. విజయవాడ నగరంలో పట్టాభి ఇంటి పై దాడి వెనుక విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే పట్టాభి ఇంటికి ఆటోల్లో వచ్చిన కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు, సీసీ కెమేరాల్లో ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అవినాష్ అనుచరులతో పాటు గుంటూరు కు చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య, మరి కొందరు టీడీపీ కార్యాలయానికి కార్లలో వచ్చినట్లుగా కూడ సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఆ కార్లపై సైతం అప్పిరెడ్డి పేరు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను టీడీపీ నేతలు పోలీసులకు సమర్పించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా.. ప్రయోజనం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.