Guntur Murder: గుంటూరులో దారుణం జరిగింది. కత్తులు, వేట కొడవళ్లతో నరికి ఓ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. జనం అందరూ చూస్తుండగానే.. ప్రాణాలు కాపాడుకునేందుకు స్థానికంగా ఉన్న కిరాణా దుకాణంలోకి వెళ్లి దాక్కున్నా, వెంటాడి, వేటాడి మరీ చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 


అసలేం జరిగిందంటే..?


గుంటూరు జిల్లా కేంద్రంలో ప్రజలందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.  కత్తులు, వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. ప్రాణాలు కాపాడుకోవటానికి స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి దాక్కున్నా... అక్కడకు కూడా వెళ్లి హత్య చేశారు. దాంతో ఆ ప్రాంతంలోని వ్యాపార వర్గాలు, షాపింగ్‌ పనుల మీద బజారుకు వచ్చిన వారంతా తీవ్రంగా భయపడిపోయి ఎటు పడితే అటు పరుగులు తీశారు. పట్నం బజార్‌ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సమీపంలోని బాబు హోటల్‌ వద్ద (ఏటుకూరి రోడ్‌)  రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అయితే చనిపోయిన వ్యక్తి నల్లచెరువు ఆరోలైన్‌కు చెందిన దొడ్డి రమేష్‌(38)గా గుర్తించారు. 


ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దొడ్డి రమేష్ ఫైనాన్స్‌ వ్యాపారంతో పాటు శుభకార్యాలకు డెకరేషన్‌ పనులు కూడా చేస్తారు. రాత్రి ఏడు, ఏడున్నర వరకూ తమ కుమారుడు రమేష్ ఇంట్లోనే ఉన్నాడని.. స్నానానికి నీళ్లు పెట్టేలోగా ఎవరో ఫోన్ చేసి పిలవగా బయటకు వెళ్లాడని మృతుడి తల్లి చెబుతోంది. అయితే వెళ్లిన కాసేపటికే కుమారుడు చనిపోవడాన్ని తలుచుకుంటూ ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. రమేష్‌పై గుంటూరు లాలాపేట స్టేషన్‌లో రౌడీషీట్‌(ఏ కేటగిరి) ఉంది. అయితే మృతుడు రమేష్ కు గతంలో పాత గుంటూరులోని చాకలి కుంట వద్ద జరిగిన ఓ హత్య కేసులో హస్తం ఉందని పోలీసులు చెప్పారు.  రమేష్ హత్యకు సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం నగరంలో జల్లెడ పడుతున్నాయి. 


అతనే నా భర్తను హత్య చేశాడు..


తన భర్తను బుడంపాడుకు చెందిన రౌడీషీటర్‌ ఆర్కే హత్య చేశాడని రమేష్ భార్య లత ఆరోపించారు. తన భర్తకు ప్రాణభయం ఉందని పోలీసుల వద్దకు వెళ్లినా ఏ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. గత కొంత కాలంగా రమేష్, తాను చాలా భయంభయంగా బతుకుతున్నామని.. కానీ నడిరోడ్డుపై ప్రజలందరి ముందే తన భర్తను అంత దారుణంగా హత్య చేస్తారని ఊహించలేకపోయానంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 


అమెరికాలో గుంటూరు యువకుడి మృతి


గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకరు అమెరికాలో మృతి చెందారు. గంగూరు శ్రీనాథ్(32 ) అమెరికాలో ఉంటున్నాడు. గుంటూరు వికాస్ నగర్ కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావు, రాజ శ్రీ దంపతుల కుమర్తె సాయి చరణి, రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనాథ్ కు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. గతంలో వీరు ఫ్లోరిడాలో ఉండేవారు. ఆరు నెలల కిందట శ్రీనాథ్, సాయి చరణి అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ఔటింగ్ కు వెళ్లారు. దంపతులు ఇద్దరూ కలిసి అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్ లెన్స్ మౌంటెన్ హిల్స్ లో ఎత్తయిన ప్రదేశానికి చేరుకోగా.. అక్కడి నుండి శ్రీనాథ్ పట్టుతప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోయాడు.