అమరావతి/పిలేరు: పీలేరులో భూ అక్రమాల‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) మరోసారి స్పష్టం చేశారు. పీలేరులో భూ అక్రమాల‌పై సీఐడీ లేదా సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దమ్ముంటే సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని సీఎంకు రాసిన లేఖ ద్వారా లోకేష్ సవాల్ విసిరారు. పీలేరులో భూ అక్రమాలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ సీఎం జగన్ కు రాసిన లేఖలో లోకేష్ (Lokesh Written Letter To YS Jagan) పేర్కొన్నారు. 


విచారణ జరిపించే దమ్ముందా ?
భూ ఆక్రమణలు నిర్ధారిస్తూ గతంలో కలెక్టర్ రూపొందించిన నివేదికను సీఎం జగన్ కు రాసిన తన లేఖకు జత చేశారు లోకేష్. పీలేరు ఎమ్మెల్యే శాసనసభ లో కోరినట్లు విచారణ జరిపించే దమ్ముందా అని లోకేష్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో భూ మాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ భూ మాఫియా ఏ అవకాశమూ వదలకుండా దోచుకుంటోందని లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వం భూ మాఫియాపై చర్యలు తీసుకోక పోగా సహకరిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. 


ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ 
ఒక్క పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 601.37 ఎకరాల భూమిని ఈ భూ మాఫియా దోచుకుంది. తెలుగుదేశం పోరాటంతో చిత్తూరు కలెక్టర్‌ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ చేయించారు. మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదిక సమర్పించారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ తన నివేదికలో సిఫార్సు కూడా చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాఫియా పట్ల ఉదాసీనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.


ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పండి.. 
పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో భూ కబ్జాకు పాల్పడిన ల్యాండ్ మాఫియా పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పండి. అధికార వైకాపా నేతలకు భూ మాఫియాతో ప్రమేయం ఉన్నందుకే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పీలేరులోని భూ కుంభకోణంపై సిఐడి లేదా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గ‌తంలో శాసనసభలో కోరారని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. 


విచారణకు వైసీపీ ప్రభుత్వం వెనకడుగు! 
పీలేరు అసెంబ్లీ పరిధిలో జరిగిన భూ కుంభకోణంపై సిఐడి లేదా సిబిఐ విచారణను ఏర్పాటు చేయడంలో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ భూ మాఫియాను  రక్షించడానికే ప్రభుత్వ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడిన వీడియోలను తన లేఖతో పాటు జత చేసి పంపించారు లోకేష్. అక్రమాలు జరిగాయని గతంలో తాను ఆరోపించానని, ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని.. సీఎం జగన్ విచారణ జరిపించాలని తాజాగా లేఖ ద్వారా మరోసారి డిమాండ్ చేశారు.