గుంటూరు తెలుగు దేశం పార్టీ రాజకీయాలు చాలా హాట్‌గా మారాయి. ఎట్టి పరిస్దితుల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేయాలనే టార్గెట్‌తో ఇరు పార్టీలకు చెందిన నాయకులు దీక్ష తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో దశాబ్దాలుగా ఉన్న విభేదాలను సైతం పక్కన పెట్టి అందరిని కలుపుకొని వెళ్ళేందుకు అవసరమైన అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగు దేశం పార్టీలో చేరి కన్నా లక్ష్మీనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాయకులను కలుపుకునే క్రమంలో ప్రత్యేక విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు హజరయ్యారు.


ఇదే సమావేశానికి మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి శ్రీనివాస్ కూడా రావడం అందర్నీ ఆకట్టుకుంది. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. కన్నాపై రాయపాటి సాంబశివరావు పరువు నష్టం కేసు కూడా వేశారు. అయితే కోర్టులో ఇరువురు నేతలు రాజీపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇరువురు నేతలు పోటాపోటీగా రాజకీయాలు నడిపించారు. ఆ క్రమంలో ఇరువురి గ్రూపులు కూడా ఉన్నాయి. రాజకీయంగా ఘర్షణలకు కూడా జరిగాయి. ఒకరిపై ఒకరు కేసులు బనాయించుకోవటం, ఆందోళనలు చేయటం వంటి ఘటనలు గుంటూరు రాజకీయాల్లో షరామామూలుగా సాగుతూ వచ్చాయి. 


మొదట్లో వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్లు. విభేదాలు కూడా అదే స్థాయిలో ఉండేవీ. తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు కారణంగా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడారు. రాయపాటి టీడీపీలో చేరితే... కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. అక్కడ నుంచి తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోవటం జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి ఒకే పార్టిలోకి వచ్చిన కన్నా, రాయపాటి కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నడిచింది. ఒకే పార్టీలో ఉంటూ తరచూ తిటుకునే వాళ్లు ఇప్పుడు టీడీపీలో ఎలా ఉంటారనే చర్చ కూడా సాగింది. 


అనూహ్యంగా రెండు వర్గాలు కలిసి విందు భేటీలో పాల్గొనడం గంటూరు రాజకీయాల్లో ఇదో ట్విస్ట్ అంటున్నారు స్థానికులు. ఇద్దరూ కలసి రాజకీయం చేయాలని నిర్ణయించారట కూడా. అందులో భాగంగానే కన్నా లక్ష్మినారాయణ నిర్వహించిన సమావేశానికి రాయపాటి శ్రీనివాస్ హజరయ్యారు. శ్రీనివాస్ గతంలో గుంటూరు మేయర్‌గా ఎమ్మెల్సీగా కూడా పని చేశారు.


ఆసక్తిగా మారిన రాజకీయం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవటమే ధ్యేయంగా తెలుగు దేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కన్నా లక్ష్మి నారాయణ వంటి కీలక నేతలను పార్టీలోకి ఆహ్వనించారు. ఆ తరువాత నుంచి పార్టీలో కార్యకలాపాలు కూడా దూకుడు పెంచింది. పార్టీలోని నాయకులను యాక్టివ్ చేయటం,కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్ళటం వంటి వ్యూహత్మకమైన ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే సీనియర్ నేత అయిన కన్నా లక్ష్మినారాయణకు చంద్రబాబు ఆ బాధ్యతలను అప్పగించారనే ప్రచారం జరుగుతుంది. 


చంద్రబాబు ఇచ్చిన పవర్‌తో కన్నా ఫుల్ టైం పాలిటిక్స్‌ను గుంటూరు కేంద్రంగా నిర్వర్తిస్తున్నారు. ముందు గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీకి చెందిన క్యాడర్ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.  అనంతరం కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. పొలిటికల్‌గా అన్ని జిల్లాల్లో కూడా కన్నాకు ఫాలోయింగ్ ఉన్నందున వాటిని తెలుగు దేశానికి అవసరమైన రీతిలో ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. 


ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లి నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవటమే ప్రధాన లక్ష్యంగా తెలుగు దేశం నేలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని,అందులో కన్నా లక్ష్మినారాయణ కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే వైరి వర్గాన్ని కూడా కలుపుకొని వెళ్లేందుకు వెనుకాడటం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నా మాట.