రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది. మూడు రాజధానుల అంశం ఏ టర్న్ తీసుకోనుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందిలో జరుగుతున్న చర్చ. అమరావతే ఏకైక రాజధాని అంటూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతోపాటు చాలా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేయనుంది. 


ఈ కేసులో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రాజధాని ప్రాంత రైతులు తమ వాదన వినిపంచారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే... హైకోర్టు తీర్పు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అమరావతి ప్రాంత రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతి చట్టం ప్రకారమే ఏర్పడిందని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. మూడు రాజధానుల సంగతి తమకు తెలియదని కేంద్రం చెప్పేసింది. ఇలా ఎవరి వాదన వాళ్లు వినిపించిన వేళ సుప్రీం కోర్టు ఎలా విచారణ చేయనుందో అన్న సస్పెన్స్‌ మాత్రం కొనసాగుతోంది. 


రాష్ట్రప్రభుత్వం, రైతులు వేసిన రెండు పిటిషన్లను న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వైజాగ్ షిప్ట్ అవ్వాలని భావిస్తున్న జగన్... ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఈ తీర్పు కోసం ఎక్కువ వైసీపీ ఎదురు చూస్తోంది. 


ఒకసారి నిర్ణయమైపోయిన రాజధానిని పదే పదే మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాని లేదని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది. అమరావతి అభివృద్ధి చేయడానికి గడువు కూడా పెట్టింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ అధికార పరిధుల్లో పని చేయాలని న్యాయవ్యవస్థ అతి జోక్యంతో సమస్యలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. రాజధానిని నిర్ణయించుకునే హక్కు 
రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని లేకుంటే సమాఖ్య వ్యవస్థకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది.