వివక్ష అనేది ఎదుర్కొన్నప్పుడే దాని పెయిన్ తెలుస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీన్ని చూస్తే మాత్రం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చన్నారు. తాను గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో వివక్ష ఎదుర్కొన్న సంఘటన వివరించారు. తోలు తెల్లగా లేని కారణంగా అవమాన పడ్డానని పేర్కొన్నారు. 


తాను చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించానని ఆ సమయంలో తనకు వివక్ష ఎదురైందన్నారు. దాహంగా ఉందని ఎయిర్‌హోస్ట్‌కు నీళ్లు అడినట్టు తెలిపారు. పక్కవాళ్లందరికీ నీళ్లు ఇస్తున్న ఆమె.. తనకు మాత్రం మంచినీళ్లు ఇవ్వలేదన్నారు. గంట దాటిందని అయినా నీళ్లు మాత్రం ఇవ్వలేదన్నారు. చివరకు చేరాల్సిన గమ్యం వచ్చిందని... అందరూ దిగిన తాను మాత్రం దిగలేదని చెప్పుకొచ్చారు. అక్కడ సిబ్బంది వచ్చి ఎందుకు దిగలేదని ప్రశ్నిస్తే.. తాను పైలెట్‌తో మాట్లాడాలని ఆయన్ని రమ్మని చెప్పానని వివరించారు పవన్.



పైలెట్‌ వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించారని... తాను మంచినీళ్లు అడిగితే చాలా సమయం నుంచి అందరికీ ఇచ్చిన ఎయిర్‌ హోస్ట్ తనకు మాత్రం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారట పవన్ కల్యాణ్. భారతీయుల డబ్బులు మీ కంపెనీకి అవసరం లేదనుకుంటే సర్వీస్‌లు నడపనవసరం లేదని చెప్పారట. అంతే కానీ.. ఇలా ప్రయాణికులను అవమానించడం ఏంటని ప్రశ్నించారట. నీళ్లు ఇవ్వడానికి కూడా జాత్యాహంకారం అడ్డొస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామన్నారు. 


జరిగిన సంఘటనపై విమానయాన సర్వీస్‌ సారీ చెప్పిందని వివరించారు పవన్. జరిగిన తప్పిదానికి ప్రతిగా... తనకు వైన్‌ బాటిల్స్ ఇవ్వబోయారన్నారు. అయితే ఆ ఫ్లైట్‌లో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికీ తలో ఐదు వైన్‌ బాటిళ్లు కొనిచ్చే స్థాయి ఉన్న వ్యక్తినని వాళ్లకు వివరించినట్టు చెప్పుకొచ్చారు. రంగు వేరు అయి ఉండొచ్చు కానీ... మరే ఇతర ఇండియన్ ట్రావెలర్స్‌కు ఇలాంటి అవమానం, సమస్య రానీయొద్దని చెప్పినట్టు తెలిపారు. 






వివక్షకు గురయ్యే కులాలను అర్థం చేసుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్. కొన్నిసార్లు ఒకరిద్దరు చేసే తప్పులకు ఆ కులం మొత్తం దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందని వివరించారు. శిరోముండనం చేసిన వ్యక్తిపై కాకుండా ఆ సామాజిక వర్గంపై కక్ష పెరుగుతుందన్నారు. అలాగని.. ఆ సామాజిక వర్గంలోని వారందరూ అలాంటి వాళ్లే అనుకుంటే మాత్రం పొరపాటే అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు. 






ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందన్న విషయంపై జనసేన నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పవన్ కల్యాణ్‌ మాట్టాడారు. దేహీ అంటే ఎవరూ ఇవ్వరని.. పోరాడి లాక్కోవాలని సూచించారు పవన్ కల్యాణ్. 


ఓ ఎస్సీ వర్గానికి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి తన ఇంట్లో వివాహానికి పిలిచారని.. ఆయన బంధువులు వైసీపీలో ఉన్నారని గ్రహించి వెళ్లేందుకు నిరాకరించానన్నారు పవన్‌. అయినా సరే వాళ్లు రావాలని బలవంతం చేశారని చెప్పారు. అయితే బయల్దేరడానికి ఓ అరగంట ముందు ఫోన్ చేసి మీరు వస్తే సీఎం స్థాయి వ్యక్తి రావడానికి ఇష్టపడటం లేదని చెప్పారన్నారు. దీంతో ఆగిపోయానని వివరించారు. మా ఇద్దరం అంతకు ముందు చాలా పెళ్లిళ్లకు వెళ్లామని.. కానీ అక్కడ రాని వివక్ష ఇక్కడెందుకని ప్రశ్నించారు. ఆ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి వాళ్లను శాసించలేరనే నమ్మకంతో ఇలా చేశారన్నారు.