నిధుల కోసం ఎదురు చూస్తున్న ఏపీ రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నిధులు సమకూరడానికి కారణాన్ని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. దాదాపు రూ.10 వేల కోట్ల మేర కేంద్రం రెవెన్యూ లోటు నిధుల్ని విడుదల చేయడానికి కారణం.. ఇటీవల తాము నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగమేనని అన్నారు. ఆ యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు ఏర్పడి నిధులు సమకూరాయని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని, రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానని అన్నారు.


శ్రీశైలం క్షేత్రంలో కుంభాభిషేకం నిర్వహించడానికి సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామని చెప్పారు. వచ్చే కార్తీక మాసంలో నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు. ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. 


హథీరాం జీ మఠానికి మరో వ్యక్తి ఇంఛార్జి


మరోవైపు, తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, కోట్ల రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఏ హక్కులూ లేకుండా అర్జున్ దాస్ కోర్టుకు వెళ్లారని అన్నారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని మంత్రి వివరించారు. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ అర్జున్ దాస్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారని చెప్పారు. దీనిపై కమిటీని వేసి చర్యలు కూడా తీసుకున్నామని, అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్‌గా ఉన్న అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగాన్ని నిర్వహించారు. మే 12 నుంచి మే 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఆ కార్యక్రమం జరిగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహా యాగాన్ని నిర్వహించారు. రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండేలా, ప్రజలు సౌభాగ్యంతో జీవించేలా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ఎంతో పవిత్రమైన ఈ యజ్ణాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మే 17వ తేదీన చివరి అంకంలో భాగంగా పూర్ణహుతి జరిగింది. యాగం నిర్వహణకు దాదాపు రూ.5 కోట్లు వ్యయం అయింది.


రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అధిగమించి, సంక్షేమాన్ని ఆశిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించటం ఇదే ప్రప్రథమం. అందుకే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా యాగానికి హజరయ్యారు.